iDreamPost

దారుణం: రూ.400 కోసం ముగ్గురి వ్యక్తుల హత్య!

దారుణం: రూ.400 కోసం ముగ్గురి వ్యక్తుల హత్య!

బీహార్ లో దారుణం చోటు చేసుకుంది. కేవలం రూ.400 కోసం కొందరు దుండగులు ముగ్గురు వ్యక్తులను పొట్టన బెట్టుకున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అయితే ఈ హత్యకు దారి తీసిన అసలు కారణాలు ఏంటి? ఈ ఘటనలో అసలేం జరిగిందంటే? బీహార్ పాట్నా పరిధిలోని ఫతుహాలోని సురంగపూర్ గ్రామంలో గురువారం పాల డబ్బుల విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వాదం నడిచింది. కాగా, ఈ గొడవ రాను రాను తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఒకరిపై ఒకరు రెండు వర్గాలు భీకర దాడులు చేసుకున్నాయి.

ఈ క్రమంలోనే ఓ వర్గం వ్యక్తులు చేతుల్లో.. శైలేష్ సింగ్, జై సింగ్, ప్రదీప్ సింగ్ అనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదే కాకుండా మింటస్ కుమార్ అనే 19 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించిన పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, గాయపడ్డ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ క్రమంలోనే గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.

అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆ తర్వాత పోలీసులు మాట్లాడుతూ.. వీరి మధ్య గత కొంత కాలంగా భూ వివాదాలు, పాల డబ్బుల విషయంపై గొడవలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే గొడవ తీవ్ర దాల్చి చివరికి హత్యల వరకు వెళ్లారని పోలీసులు తెలిపారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి