Idream media
Idream media
మహాత్ముడి కలల సాకారం దిశగా రూపాంతరం చెందిన ఏపీ.. ఆ మహాత్ముడి మ్యూజియాన్ని తీర్చిదిద్దడంలోనూ చిత్తశుద్ధిని కనబరిచింది. విజయవాడలోని బాపూజీ మ్యూజియం సాంకేతిక వినియోగంలో దేశంలోనే ముందు వరుసలో నిలిచేలా రూపుదిద్దుకుంది. 10 లక్షల సంవత్సరాల చరిత్రకు సాక్షిగా నిలవనుంది. గత పాలకుల హయాంలో నిరాధరణకు గురైన ఈ మ్యూజియం అభివృద్ధిపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. అందుకనుగుణంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రూ. 8 కోట్లు వెచ్చించి మ్యూజియాన్ని అత్యంత ఆధునికీకరణంగా తీర్చిదిద్దారు.
పురాతన వస్తువులు.. ఆధునిక ప్రదర్శన
అరుదైన 1500 పురాతన వస్తువులను మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శన ఆధునికతను జోడించుకుంది. దేశంలోనే తొలి సారిగా యాప్ ఆధారిత ప్రదర్శనకు ఈ మ్యూజియం నిలయంగా నిలిచింది. ఆదిమ మానవ యుగం నుంచి నేటి ఆధునిక యుగం వరకూ అన్నింటినీ గుర్తుకు తెచ్చే అపురూప సంపద ఇక్కడ నిక్షిప్తం అయింది. ఇక్కడి ప్రాక్, తొలి చారిత్రక యుగ గ్యాలరీ, బుద్ధ – జైన గ్యాలరీ, మధ్య యుగపు కళాధృక్పథాల గ్యాలరీ, ఆయుధములు, కవచముల గ్యాలరీలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. స్వాత్రంత్యోద్యమ స్ఫూర్తి రగిలించేలా చిత్రపటాలను ప్రదర్శించారు. నాటి సంగ్రామానికి చెందిన విశేషాలను సాక్షాత్కరించారు.
ప్రత్యేక ఆకర్షణగా డిజిటిల్ వాల్ ప్యానల్
బాపూ మ్యూజియంలోని స్క్రీన్ ను టచ్ చేయడం ద్వారా 1500 పురాతన వస్తువులను పెద్దగా చూసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం డిజిటల్ వాల్ ప్యానల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గాంధీ జయంతి సందర్భంగా మ్యూజియాన్ని ప్రారంభించిన సీఎం జగన్ కూడా ఈ స్క్రీన్ ను టచ్ చేసి పలు విషయాలను పరిశీలించారు. అలాగే మ్యూజియంలోని ప్రతీ కేబినెట్ ను చారిత్రక కాలానుగుణంగా వాటి నేపథ్యం అందరికీ సులువుగా అర్థమయ్యేలా సరళమైన భాషలో నిక్షిప్తం చేశారు. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన 10 బౌద్ధ స్థలాలకు చెందిన వివరాలతో డిజిటల్ బుక్ ను మ్యూజియంలో అందుబాటులో ఉంచారు. ఇలా మహాత్ముడి విశేషాలతో పాటు చారిత్రక కళావైభవాన్ని చాటేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దడం ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రశంసలు అందుకుంటోంది.