iDreamPost

ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు ప్రశంసలు

ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు ప్రశంసలు

విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో చోటు చేసుకున్న గ్యాస్ లీకేజీ వ్యవహారంలో రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించిందని రాష్ట్ర ఉన్న న్యాయస్థానం ప్రశంసించింది.

విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఎంతో గొప్పగా వ్యవహరించిందని, ఈ ఘటనలో మృతి చెందిన ప్రతి ఒక్కరికీ కోటి రూపాయల భారీ తక్షణ నష్ట పరిహారం అందించడాన్ని రాష్ట్ర హైకోర్టు అభినందించింది. ఇది చాలా గొప్ప విషయమని, ఇంత భారీ మొత్తాన్ని పరిహారంగా ఇచ్చిన ప్రభుత్వ మానవతా దృక్పథాన్ని.. దయార్ద హృదయాన్ని అభినందిస్తున్నామని హైకోర్టు పేర్కొంది.

కరోనా వల్ల కోర్టులు పనిచేయకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాదులను కూడా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పిటిషనర్‌ కోరుతున్న విధంగా న్యాయవాదులకు వడ్డీ రహిత రుణాలు ఇచ్చేలా బ్యాంకులను కోర్టులు ఆదేశించజాలవని హైకోర్టు స్పష్టం చేసింది.

న్యాయవాదులను ఆదుకునేందుకు ఇప్పటికే కేటాయించిన రూ.100 కోట్ల విషయంలో తదుపరి చర్యలు ఏం తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ దేవానంద్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాదులకు ఎస్‌బిఐ ద్వారా వడ్డీ రహిత వ్యక్తిగత రుణంగా రూ.లక్ష ఇప్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎం.గిరిబాబు హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు.

ఇవి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులేనని, కేంద్ర నిధులు కావని స్పష్టం చేశారు. ఈ మొత్తాన్ని బార్‌ కౌన్సిల్‌ ద్వారా న్యాయవాదుల కోసం ఉపయోగించాలని నిర్ణయించిందన్నారు. ఈ విషయంలో జీవో జారీ చేయాల్సి ఉందని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి