iDreamPost

ఫలించిన జగన్ కృషి, ఎట్టకేలకు నెరవేరబోతున్న గిరిజనుల కల

ఫలించిన జగన్ కృషి, ఎట్టకేలకు నెరవేరబోతున్న గిరిజనుల కల

ఏపీలో గిరిజనుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని ప్రకటించిన జగన్ దానికి అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్లకు కూడా పరిష్కారం కనుగొంటున్నారు. అందులో భాగంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు విషయంలో జగన్ ప్రభుత్వ ప్రతిపాదనలకు మోక్షం కలిగింది. కేంద్రం నుంచి అంగీకారం వచ్చింది. దాంతో ఏపీలో గిరిజనులకు కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఎన్నో ఏళ్ల కల నెరవేరేందుకు మార్గం సుగమం అయ్యింది.

ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సందర్భంగా జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఉమ్మడిగా ఉంది. దాని ఫలితంగా ఎస్టీలకు తగిన ప్రయోజనం దక్కడం లేదనే వాదన ఉంది. దాంతో ఎస్టీలకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ని జగన్ అంగీకరించారు. దానికి అనుగుణంగా అధికారంలోకి రాగానే చట్టం కూడా తయారు చేశారు. దానికి కేంద్రం నుంచి అనుమతి కావాల్సి ఉండడంతో కేంద్ర ప్రభుత్వానికి పంపించారు.

జగన్ ప్రభుత్వం చేసిన ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం దక్కింది. ఆ వెంటనే ఏపీ గిరిజన మంత్రిత్వ శాఖ నుంచి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యింది. దాంతో ఎస్టీ కమిషన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్టయ్యింది. కమిషన్ చైర్మన్, సభ్యుల ఎంపిక ఎలా చేయాలన్నది త్వరలో నిర్ణయిస్తారు. అది పూర్తికాగానే పూర్తి స్థాయి కమిషన్ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతో గిరిజనుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధికి ఇదో నిదర్శనంగా పలువురు గిరిజన సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గిరిజన శాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి కూడా పట్టుదల చేసిన ప్రయత్నాలు ఫలించాయని చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దలకు గిరిజన ప్రతినిధులు కృతజ్ఙతలు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి