iDreamPost

గుండెపోటు మరణాల నివారణపై AP సర్కారు ప్రత్యేక దృష్టి!

గుండెపోటు మరణాల నివారణపై AP సర్కారు ప్రత్యేక దృష్టి!

గుండె సంబంధిత వ్యాధుల కారణంగా పెరుగుతున్న మరణాలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గుండెపోటు మరణాల రేటును తగ్గించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యరంగంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుండెపోటు వచ్చిన వారికి మొదటి గంట ఎంతో కీలకం. ఆ సమయంలో ప్రాథమిక చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. అలా ప్రాణాలు కాపాడే STEMI ప్రాజెక్టుకు వైద్య ఆరోగ్యశాఖ శ్రీకారం చుట్టింది. సెప్టెంబరు నెలాఖరు నుంచి ఎంపిక చేసిన జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించనున్నారు.

ప్రస్తుతం మారుతున్న జీవన విధానంతో గుండె సంబంధిత వ్యాధులు బాగా పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గుండెపోటు మరణాలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గుండెపోటు సంభవించిన తొలి గంటలోపే(గోల్డెన్ అవర్) సరైన అత్యవసర ప్రాథమిక చికిత్సను అందించడం ద్వారా రోగి ప్రాణాలు నిలబెట్టేందుకు అవకాశాలుంటాయి. గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి సకాలంలో చేర్చాలి. అక్కడ రోగికి ఒక ఇంజక్షన్ చేస్తారు దాని ద్వారా అతనికి ప్రాణాపాయం తప్పుతుంది. తర్వాత పెద్దాస్పత్రికి తరలించిం ECG వంటి పరీక్షలు చేయాలి. ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైన శస్త్ర చికిత్సను చేస్తారు. ఇలాంటి వ్యవస్థ వల్లే గుండెపోటు మరణాలను కట్టడి చేయగలం. ఇందుకోసమే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం STEMI కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది.

అసంక్రమిక వ్యాధుల్లో గుండె సంబంధిత సమస్యల వల్లే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్‌సీడీల్లో గుండెపోటు వల్ల జరుగుతున్న మరణాలు 32% ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 38 లక్షల మంది ప్రజలు గుండె జబ్బులతో బాధపడుతున్నారు. గుండెపోటుకు గురై మరణించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలోనే కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేయాలని సీఎం జగన్ ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు, పీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రుల్లో గుండెపోటు సంబంధిత చికిత్సలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

 

గుండెపోటు సంభవించిన తొలి 40 నిమిషాల సమయం ఎంతో కీలకమైనది. ఆ సమయాన్ని సద్వినియోగం చేస్తూ రోగికి అవసరమైన చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడటమే STEMI ముఖ్య ఉద్దేశ్యం. ముందుగా గ్రామస్థాయిలో వైద్య సిబ్బందికి శిక్షణ అందించడం, సమీపంలో ఉన్న పీహెచ్సీల్లో ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉంచడం, గోల్డెన్ అవర్ లో ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ను ఉచితంగా రోగికి అందించడం, తర్వాత 100 కిలో మీటర్ల పరిధిలో క్యాథ్ లాబ్స్ ఉన్న డిస్ట్రిక్ట్ హబ్ హాస్పటల్ కు రోగిని తరలించి అవసరమైన టెస్టులు, శస్త్ర చికిత్స నిర్వహించడం ఈ కార్యక్రమంలో భాగం. ఇప్పటికే గ్రామ స్థాయిలో సిబ్బంది, వైద్యులకు శిక్షణా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలు, సిబ్బంది నియామకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రూ.120 కోట్లు వెచ్చించి క్యాథ్ లాబ్స్ నిర్మాణం చేశారు. గుంటూరు జీజీహెచ్, జీజీహెచ్ కర్నూలు, కేజీహెచ్ విశాఖపట్నం నాలుగు హబ్స్ గా ఏర్పాటు చేసి ఈ జిల్లాల పరిధిలో 61 స్పోక్స్ ను ఏర్పాటు చేసి హార్ట్ కేర్ సర్వీసులను సామాన్యులకు, గ్రామీణులకు కూడా అందుబాటులోకి తెచ్చారు.

stemi

ఏం చేస్తారంటే:

గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వ్యవస్థను వినియోగించి గుండెపోటు లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. గుండెపోటుకు గురైన వ్యక్తిని గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని స్పోక్స్ సెంటర్ కు తరలిస్తారు. పైలెట్ ప్రాజెక్టు కింద చిత్తూరులో13, కర్నూలు 16, గుంటూరు 15, విశాఖపట్నంలో 17 స్పోక్స్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన సిబ్బంది.. రోగికి అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తారు. అనంతరం రోగిని క్యాథ్ ల్యాబ్స్ ఉన్న జిల్లా ఆసుపత్రులు, టీచింగ్ హాస్పటల్ కు రిఫర్ చేస్తారు.

సిబ్బంది నియామకం:

గుండె వ్యాధులను తగ్గించేందుకు అత్యుత్తమమైన, నాణ్యమైన హార్ట్ కేర్ సర్వీసులను రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని సీఏం జగన్ ఆదేశించారు. కార్డియాలజీ విభాగంలో అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాల కోసం వేగంగా అవసరమైన పోస్టులను మంజూరు చేశారు. రాష్ట్రంలోని 11 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్డియాలజీ, క్యాథ్ ల్యాబ్, సీటీవీఎస్ విభాగాల్లో 94 పోస్టులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్స్, ల్యాబ్, ఓటీ విభాగాల్లో రెగ్యులర్, కాంట్రాక్టు పద్ధతిలో 94 పోస్టులను మంజూరు చేస్తూ జీవో రిలీజ్ చేశారు. STEMI పైలెట్ ప్రాజెక్ట్ ను సెప్టెంబర్ 29, 2023న ప్రారంభిస్తారు. జనవరి 2024 నుంచి STEMI ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి