iDreamPost

జగన్ బయోపిక్ నిజంగా రాబోతోందా

జగన్ బయోపిక్ నిజంగా రాబోతోందా

రెండేళ్ల క్రితం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మీద యాత్ర సినిమా తీసి మంచి విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు మహీ రాఘవ్ త్వరలో ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ ని తెరకెక్కించబోతున్నట్టు నిన్నంతా ఓ మీడియా వర్గంలో వార్త గట్టిగానే షికారు కొట్టింది. నిజానికి ఆ ఆలోచన మహీకి ఉన్నప్పటికీ అది ఇప్పటికిప్పుడు తీసే ప్రణాళిక లేదు. దానికి సంబంధించి స్క్రిప్ట్ కానీ, అనుమతులు కానీ సిద్ధంగా ఉన్నాయా లేదా అనే క్లారిటీ లేదు. ఇవి చాలదన్నట్టు స్కామ్ 1992లో అద్భుతంగా నటించిన ప్రతీక్ గాంధీ జగన్ గా నటించబోతున్నాడన్న వార్తలు రావడంతో ఇది ఇంకా హాట్ గా టాపిక్ గా మారింది.

అసలు వివరాల్లోకి వెళ్తే మహీ రాఘవ్ వాస్తవానికి వేరే ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో రూపొందిస్తున్న సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కాకపోతే దాని తాలూకు వివరాలు బయటికి చెప్పకుండా గుట్టు మైంటైన్ చేస్తున్నారు. మొత్తం పూర్తయ్యాక రివీల్ చేయాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ ఈలోగా జగన్ బయోపిక్ అంటూ ప్రచారం ఊపందుకోవడంతో టాపిక్ ఇంకో వైపుకు మళ్లింది. జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాకు ‘సిద్ధా లోకం ఎలా ఉంది నాయనా’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు అధికారిక ప్రకటన వచ్చాక తెలుస్తాయి.

ఒకవేళ మహి రాఘవ్ నిజంగానే యాత్ర 2నో లేదా జగన్ బయోపిక్కో అనుకున్నా దానికి చాలా టైం పట్టేలా ఉంది. ఆనందో బ్రహ్మ, యాత్ర బ్యాక్ టు బ్యాక్ హిట్ అయినప్పటికీ నెక్స్ట్ మూవీ విషయంలో ఈయన తొందరపడలేదు. డిఫరెంట్ ట్రీట్ మెంట్ తో సోషల్ సైటర్ గా ఇప్పుడు తీస్తున్న సినిమా ఉంటుందని తెలిసింది. ఈ నెలలోనే అనౌన్స్ మెంట్ రావొచ్చు. అయినా ప్రతీక్ గాంధీని నిజంగా కలిశారో లేదో కానీ ఈ బయోపిక్ టాక్ బయటికి రాగానే సోషల్ మీడియా మీమ్స్ లో ఇతను మరోసారి హై లైట్ అయ్యాడు. ఒకవేళ నిజమైతే మాత్రం ఫిజిక్, లుక్స్, యాక్టింగ్ పరంగా జగన్ పాత్రకు బెస్ట్ ఛాయస్ అని చెప్పొచ్చు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి