Idream media
Idream media
దేశ సరిహద్దులో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు విడిచిన అమర జవాన్లకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఘన నివాళులర్పించింది. ఈ రోజు మధ్యాహ్నం అసెంబ్లీ తిరిగి ప్రారంభం అవగానే అమరులైన 20 మందిజవాన్లకు సంతాపం తెలిపే తీర్మానాన్ని స్పీకర్ అనుమతి మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఆ తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. జవాన్ల త్యాగాలను సీఎం జగన్ కొనియాడారు. అనంతరం సీఎం సూచన మేరకు సభ్యులు రెండు నిమిషాలపాటు పాటు తమ సీట్లలో నిలబడి మౌనం పాటించి నివాళులర్పించారు.
‘‘దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు విధి నిర్వహణ చేస్తూ ఇండియా చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయ వద్ద ఘర్షణలో అమరులైన 20 మంది మన దేశ వీర సైనికులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున శాసన సభ ఘనమైన నివాళులర్పిస్తోంది. మొత్తం దేశంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారందరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది. తెలుగువాడు, పక్కరాష్టంలోని సూర్యాపేట వాసి అయిన కల్నల్ సంతోష్బాబు గారి త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజలకు గుర్తుండిపోతుంది. వీర మరణం పొందిన మన సైనికులకు ఆత్మ శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలకు మంచి జరగాలని తీర్మానం చేస్తున్నాం’’ అని సీఎం జగన్ సంతాప తీర్మానాన్ని అసెంబ్లీలో చదివారు.