iDreamPost

చర్చలు సఫలం.. సమ్మె విరమించి నేటి నుంచి విధుల్లోకి అగన్ వాడీలు

Anganwadi Workers Called Off Strike: అంగన్ వాడీ వర్కర్ల సమ్మెకు తెర పడింది. ప్రభుత్వం చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించుకున్నారు.

Anganwadi Workers Called Off Strike: అంగన్ వాడీ వర్కర్ల సమ్మెకు తెర పడింది. ప్రభుత్వం చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించుకున్నారు.

చర్చలు సఫలం.. సమ్మె విరమించి నేటి నుంచి విధుల్లోకి అగన్ వాడీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా అంగన్ వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. వారి సమ్మెను విరమించి మంగళవారం నుంచి విధుల్లో చేరనున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు వాళ్లు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించుకుని యథావిధిగా విధుల్లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్ వాడీలు తమ డిమాండ్లపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ మీటింగ్ అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అంగన్ వాడీల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. అలాగే ప్రభుత్వ నిర్ణయాలను బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

అంగన్ వాడీల డిమాండ్లలలో చాలా వరకు డిమాండ్లకు సంబంధించిన కార్యాచరణ కూడా ప్రారంభించాం. వారు పెట్టిన 11 డిమాండ్లలో 10 డిమాండ్లను అంగీకరించామంటూ మంత్రి బొత్స వెల్లడించారు. వారి డిమాండ్లలో ప్రధానంగా ఉన్న వేతనాల పెంపు విషయంపై అంగన్ వాడీల యూనియన్లు, ప్రభుత్వంతో చర్చించి పరస్పర అంగీకారంతోనే నిర్ణయం తీసుకున్నాం. జులై నెల నుంచి అంగన్ వాడీల వేతనం పెంపు జరిగే దిశగా పరనిచేస్తామంటూ బొత్స వ్యాఖ్యానించారు. అంగన్ వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని ప్రభుత్వం భారీగా పెంచింది. వారి సంక్షేమం, శ్రేయస్సు దృష్ట్యా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని అంగన్ వాడీ వర్కర్లకు రూ.50 వేల నుంచి రూ.1.20 లక్షలకు, హెల్పర్లకు అయితే రూ.20 వేల నుంచి రూ.60 వేలకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

Angan Wadis will be on duty from today

ఈ సందర్భంగా బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. “అందరి ఉద్యోగుల మాదిరిగానే అంగన్ వాడీల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నాం. అలాగే వారికి ప్రమోషన్స్ కోసం వయోపరిమితిని కూడా 45 నుంచి 50 ఏళ్లకు మారుస్తున్నాం. అంగన్ వాడీలో పనిచేస్తూ చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కోసం రూ.20 వేలు అందజేస్తాం. కేంద్రం నిబంధనలకు అనుకూలంగా మినీ అంగన్ వాడీలను కూడా అప్ గ్రేడ్ చేస్త్తాం. అంగన్ వాడీలకు గ్రాట్యూటీ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. వాళ్లు ఇచ్చే దాన్ని నేరుగా అంగన్ వాడీలకు అమలు చేస్తాం. అలాగే అంగన్ వాడీల సమ్మె పరిష్కారానికి ప్రత్యేక కమిటీని నియమించబోతున్నాం”  అంటూ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అలాగే సమ్మె కాలంలో అంగన్ వాడీలకు వేతనం, వారిపై పోలీసు కేసు అంశాలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తామని.. న్యాయం జరిగేలా చూస్తామంటూ బొత్స హామీ ఇచ్చారు. పెట్టిన అన్నీ డిమాండ్లకు అంగీకారం తెలపడం అంటే అది అక్కాచెల్లెమ్మల సంక్షేమంపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి అంటూ బొత్స వ్యాఖ్యానించారు.

తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అంటూ అంగన్ వాడీ యూనియన్ నాయకులు తెలిపారు. సమ్మె విరమించి విధుల్లో చేరుతున్నట్లు యూనియన్ నాయకులు వెల్లడించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు సఫలం అయ్యాయని తెలిపారు. సర్వీసులో ఉండి అంగన్ వాడీలు చనిపోతే మట్టి ఖర్చులు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అంగన్ వాడీలకు ప్రత్యేకంగా వైఎస్సార్ బీమా, అంగన్ వాడీల బీమా అమలు చేస్తామనడం కూడా సంతోషంగా ఉందంటూ యూనియన్ నాయకులు తెలిపారు. టీఏ బిల్లులు కేంద్రం ఇవ్వకపోవడం వల్లే 2017 నుంచి పెండింగ్ లో ఉన్న అంశాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం విడుదల చేసిన వెంటనే అందజేస్తామని హామీ ఇచ్చింది. అలాగే అప్పటివరకు నెలకు ఒక టీఏ బిల్లును ఇస్తామని ప్రభుత్వం చెప్పడంపై అంగన్ వాడీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి