iDreamPost

దారుణం.. గణేషుడి శోభా యాత్రలో యాసిడ్ దాడి!

దారుణం.. గణేషుడి శోభా యాత్రలో యాసిడ్ దాడి!

దేశ వ్యాప్తంగా వినాయక చతుర్థి ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు. వినాయక చవితి రోజు తమ ఇంట్లో బొజ్జగణపయ్య ప్రతిమను ప్రతిష్టించి పూజిస్తారు. ఇక వాడ వాడలా మండపాలు ఏర్పాటు చేసి రక రకాల వినాయక ప్రతిమలు ప్రతిష్టించి పదకొండు రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుపుతారు. దూప దీప నైవేద్యాలతో పూజలందుకున్న లంబోదరులను ఊరేగించి నిమజ్జనం చేస్తారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు చోట్ల గణేషుడి శోభాయాత్ర ఆనందోత్సాహాలతో జరుగుతున్నాయి. బీహార్ లో జరుగుతున్న శోభాయాత్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

గత మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా బొజ్జగణపయ్య శోభాయాత్రలు జోరుగా కొనసాగుతున్నాయి. బ్యాండ్ బాజాలతో, డీజే సౌండ్స్ తో భక్తులు సంబరంగా శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బీహార్ రాష్ట్రంలోని మోతీహరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం గణపతి శోభాయాత్ర సందర్భంగా కొంతమంది దుండగులు యాసిడ్ విసిరారు. ఈ దాడిలో కొంతమంది తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనతో మధుబన్ కంటోన్మెంట్ చౌక్ ప్రధాన రహదారిపై ఊరేగింపు ఆపిన ప్రజలు.. నింధితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మోతిహరి సదర్ ఎస్‌డీపీఓ రాజ్ తన బృందంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు రక్షణలో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇక దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేస్తామని ఆందోళన చేస్తున్నవారికి హామీ ఇచ్చారు. దీంతో అప్పటి వరకు ఆందోళన చేపట్టిన భక్తులు శాంతించారు. ఈ ఘటనపై ఎస్‌డీపీఓ రాజ్ మాట్లాడుతూ.. శోభాయాత్ర సందర్భంగా యాసిడ్ లాంటి ద్రవం రోడ్డు పై చిందినట్లు గుర్తించామని.. క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించామని అన్నారు. ఘటన జరిగిన సమీపంలో సీసీటీవీ వీడియో ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ ఘటనలో ప్రాణహాని జరగలేదని ఎస్‌డీపీఓ రాజ్ అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి