iDreamPost

“అమ్మ ఒడి” పథకం వల్లే సినిమాల కలెక్షన్లు పెరిగాయా?

“అమ్మ ఒడి” పథకం వల్లే సినిమాల కలెక్షన్లు పెరిగాయా?

Inception అనే మూవీలో చిన్న ఐడియా అనే విత్తనాన్ని ఒక వ్యక్తి మెదడులో నాటి ఆ వ్యక్తిని పతనం చేయడానికి ప్రయత్నిస్తుంది హీరో బృందం.. కానీ ఇక్కడ మాత్రం విషపుఅక్షరాలనే ఆయుధాలను వాడి ప్రజల మెదళ్లను కలుషితం చేయడానికి ప్రయత్నిస్తుంది ఆర్కే బృందం..

ఆంధ్ర జ్యోతి…విపరీతమైన అసూయతో కూడిన అక్షరాలు,చవకబారు రాతలు,ప్రజల్ని తప్పుదోవ పట్టించే వార్తలు మినహా ఆ జ్యోతి పత్రికలో మరే ఇతర వార్తలు కనిపించే పరిస్థితి లేదు..

ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటం కొందరికి సహజమే.. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టే రాతలు రాసి వాటి ద్వారా అమాయకపు ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ పత్రికను చూస్తే వెగటు పుట్టడం ఖాయం.. మోకాలికి బోడిగుండుకు ముడిపెడుతూ ఆ పత్రిక రాస్తున్న వరుస కథనాలు చూస్తున్న ప్రజలకు నిజం నెమ్మదిగా అర్థం అయ్యి తమంతట తామే పత్రికను పట్టించుకోవడం మానేశారు.. అయినా సరే తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందంగా జ్యోతి కనిపించని శత్రువుతో గాల్లో పోరాటం చేస్తూనే ఉంది..

ఆంధ్రప్రదేశ్ లోప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇంగ్లీష్ మీడియానికి ఒక మతానికి ముడి పెడుతూ మత మార్పిడులు చేయడానికే ఆంగ్ల మాధ్యమం అని మత కల్లోలాలను రెచ్చగొట్టేలా రాసిన కథనం చూస్తే ఆ పత్రిక రాతల్లోని విలువలను అర్థం చేసుకోవచ్చు.. అనేక సందర్భాల్లో అలా విషపు రాతలు రాస్తూనే వచ్చిన జ్యోతి ఈ మధ్య మరీ శృతిమించుతూ ద్వేషపూరిత వార్తలను ప్రచురిస్తుంది..

రాష్ట్రపతి జగన్ ని ట్రంప్ తో విందుకు ఆహ్వానించలేదని ఏదో వార్త రాసింది.. సరిలేరు నీకెవరు, అల వైకుంఠపురం కలెక్షన్స్ పెరగడానికి అమ్మ ఒడి పథకం కారణమని వీకెండ్ కామెంట్ లో ఆర్కే చెప్పడం చూస్తే ఆ విషపు రాతలు ఎంతగా దిగజారాయో తెలుస్తుంది.. సచివాలయ ఉద్యోగులకు వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లను ప్రభుత్వం టాప్ చేస్తున్నట్లు మరో కథనం ప్రజల మీదకి వదిలింది ఆంధ్ర జ్యోతి.. ఇదిలా ఉంటే ఆదివారం మాత్రం రాజు కక్షకు రాజ్యం బలి అనే కథనంతో ఆర్కే ప్రభుత్వంపై ఎంత కక్ష కట్టాడో అర్థం అయ్యేలా వివరించాడు..

“అమ్మ ఒడి” పథకం డబ్బులను సినిమా చూడటానికి ప్రజలు వాడారని అందుకే సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలకు(సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో) ఆంధ్రప్రదేశ్ లో కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయని, ప్రజల దగ్గర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఉన్నాయని గ్రహించిన వస్త్ర దుకాణాల వారు వస్త్రాల కొనుగోలుపై డిస్కౌంట్లు ఇవ్వడమే మానేశారని వివరణ ఇచ్చిన ఆర్కే గారి తెలివితేటలను గమనిస్తే ఆ రాతల్లో విద్వేషాన్ని అర్థం చేసుకోవచ్చు.. ప్రతీ అక్షరం విద్వేషాలను రెచ్చగొట్టేలా, మోసపూరిత, విద్వేషపూరిత,కుట్రపూరిత, కుటిలత్వపు కథనాలు ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతిని ప్రజలు గమనిస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా అచ్చోసిన ఆంబోతులా అచ్చేయడం ఆ పత్రికకే చెల్లింది. ఇప్పటికే ఆ కథనాల్లో ఉన్న నిజాయితీ గురించి ప్రజలు చర్చ మొదలయ్యింది.

సోషల్ మీడియా పరిధి పెరిగి అసలైన నిజాలు క్షణాల్లో ప్రజలకు తెలుస్తున్న ఈ రోజుల్లో కూడా ఇంకా పాత పద్దతిలో అసత్యాలను ప్రచురిస్తూ ప్రజల మెదళ్లను ప్రభావితం చేయాలని చూస్తున్న ఆంధ్రజ్యోతిని చూస్తుంటే జాలి కలుగక మానదు.. ఇకనైనా కళ్ళు తెరిచి సత్యాన్ని గ్రహించి నిజాయితీగా కథనాలు ప్రచురిస్తే పత్రికకు, దాన్ని చదివే పాఠకులకు మంచి జరుగుతుంది.. లేకుంటే ఇప్పటికే మరుగున పడిన పత్రికల్లో ఆంధ్రజ్యోతికి కూడా స్థానం దక్కినట్లే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి