iDreamPost

వణికిస్తున్న కరోనా…ఒక్కరోజులో 12,881 పాజిటివ్ కేసులు

వణికిస్తున్న కరోనా…ఒక్కరోజులో 12,881 పాజిటివ్ కేసులు

కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 11 వేలకు పైగా కేసులు, 300 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 12,881 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి.

ఇప్పటివరకూ నిర్దారణ అయిన పాజిటివ్ కేసుల్లో ఇదే మొదటిసారి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3,66,946కి కి చేరింది.  అంతేకాకుండా మరణాల సంఖ్య 12,237 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.నిన్న ఒక్కరోజులో 334 మరణాలు సంభవించాయి.  ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగవ స్థానంలో కొనసాగుతోంది.  కరోనా వైరస్ బారినుండి 1,94,324మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 1,60,384మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో 3,307 కరోనా కేసుల నమోదు

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 2701 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,16,752 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 5651 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 61,587 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. 3,244 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో నిన్న కొత్తగా అత్యధికంగా 269 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 5675 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2412 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 3071 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 192 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 351 కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 7071 మందికి కరోనా సోకగా 90 మంది మృత్యువాత పడ్డారు. 3641 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3340 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 8,406,068 మందికి కోవిడ్ 19 సోకగా 451,387 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 4,415,833 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 2,234,471 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 119,941 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి