iDreamPost

దావోస్‌ నుంచి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన సీఎం జగన్.. మరిన్ని పెట్టుబడులు రాక..

దావోస్‌ నుంచి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన సీఎం జగన్.. మరిన్ని పెట్టుబడులు రాక..

గత కొన్ని రోజులుగా దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సమావేశాల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. అభివృద్ధిని, పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశ్రామికంగా రాష్ట్రాన్ని శక్తివంతంగా తయారుచేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో దావోస్‌ వేదికగా చక్కటి ఫలితాలు సాధించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఈ దావోస్ వేదికని చక్కగా వినియోగించుకున్నారు. పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని రాష్ట్రంలోకి దావోస్‌ నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు సీఎం జగన్.

పారిశ్రామికీకరణకు ప్రధాన కేంద్రంగా ఏపీని మార్చాలని గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్‌కో, అరబిందోలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పలు వినూత్న విధానాలతో 27,700 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ రాష్ట్రంలోకి రాబోతోంది. అలాగే గ్రీన్‌ కోతో కలిసి ప్రపంచంలోనే తొలిసారిగా గ్రీన్‌ ఎనర్జీపై ఏపీలో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ ఆర్సిలర్‌ మిట్టల్‌ ప్రకటించింది. దీనిపై ముఖ్యమంత్రి జగన్, సంస్థ సీఈఓ ఆదిత్య మిట్టల్‌ ఈ ప్రకటన చేశారు. స్టీల్‌తోపాటు, ఎనర్జీ, నిర్మాణ, మైనింగ్, రవాణా, ప్యాకేజింగ్‌ తదితర రంగాల్లో ఉన్న 76.571 బిలియన్‌ డాలర్ల ఆర్సిలర్‌ మిట్టల్‌ గ్రూపు తొలిసారిగా గ్రీన్‌ ఎనర్జీకి వేదికగా రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవడం హర్షనీయం.

అలాగే కొత్తతరం ఇంధనాలు హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తులపైన కూడా దావోస్‌లో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. కర్బన రహిత పారిశ్రామికీకరణకు ఏపీ కేంద్రంగా నిలుస్తోందని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ప్రశంసించారు. గ్రీన్‌ ఎనర్జీని వినియోగించుకుని పారిశ్రామిక ఉత్పత్తులు సాధించే దిశగా మచిలీపట్నంలో ఒక SEZను తీసుకురానున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఒప్పందం కూడా చేసుకుంది. గ్రీన్‌ ఎనర్జీని వినియోగించుకొని ఆధునిక పద్ధతుల్లో ఉత్పత్తులు సాధించేవిధంగా ఈ జోన్‌ను అభివృద్ధి చేయనున్నారు.

కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణ సమతుల్యతకు, నాణ్యతకు విలువ ఇచ్చి గ్రీన్‌ ఎనర్జీని వినియోగించుకొని టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తూ ప్రపంచస్థాయిలో ఏపీ ముందుండాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దావోస్‌లో అడుగులు వేసి ఇందుకు సంబంధించి WEF(World Economic Forum)తో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం WEF నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి WEF తగిన సహకారాన్ని అందించనుంది.

ఇక రాష్ట్రంలోకి కొత్తగా నాలుగు పోర్టులు వస్తుండటంతో పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణపైనా కూడా దావోస్‌ లో సీఎం జగన్ దృష్టి సారించారు. దీనికి సంబంధించి దస్సాల్ట్‌ సిస్టమ్స్, మిట్సుయి ఓఎస్‌కే లైన్స్‌తో చర్చల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్‌. సముద్ర మార్గం ద్వారా రవాణాను మూడు రెట్లు పెంచే ఉద్దేశ్యంతో ఇదివరకే ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఈ వివరాలను ఆ కంపెనీల ప్రతినిధుల ముందుంచారు. దీంతో త్వరలోనే కాకినాడలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు మిట్సుయి ఓఎస్‌కే లైన్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్, సీఈఓ తకీషి హషిమొటో ప్రకటించారు. ఇది ఏపీకి చాలా ఉపయోగపడనుంది.

అలాగే ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలిచి, పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని బైజూస్‌ సంస్థ ప్రకటించింది. సమగ్ర భూ సర్వే రికార్డుల డేటాను నిక్షిప్తం చేయడంలో సహాయ సహకారాలు అందిస్తామని కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ సంస్థ ప్రకటించింది.

మొదటి నుంచి విశాఖపట్టణానికి ప్రత్యేక గుర్తింపు తీసుకు రావాలనుకుంటున్న జగన్ ఈ దావోస్ లోను విశాఖ కోసం గట్టి ప్రయత్నాలే చేశారు. దీంట్లో భాగంగానే ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి హైఎండ్‌ టెక్నాలజీపై పాఠ్యప్రణాళిక రూపకల్పనలో భాగస్వామ్యం అవుతామని టెక్‌ మహీంద్ర తెలిపింది. టెక్నాలజీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దాలని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా విశాఖను తయారు చేయాలని సీఎం అనుకుంటున్నట్టు టెక్‌ మహీంద్ర సీఈఓ గుర్నాని ముఖ్యమంత్రి భేటీ అనంతరం మీడియాకి తెలిపారు.

ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్‌ కృష్ణతోనూ సీఎం జగన్‌ భేటీ అయ్యారు. యూనికార్న్‌ స్టార్టప్స్‌కూ వేదికగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడానికి సీఎం దావోస్‌ వేదికగా ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగా వివిధ యూనికార్న్‌ స్టార్టప్స్‌ వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్‌లో సీఎం భేటీ అయ్యారు.

ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం సీఎం జగన్ ఈజ్‌మై ట్రిప్‌ తో భేటీ అయ్యి పెట్టుబడులకు ఒప్పించారు. వారు కూడా విశాఖపట్టణం కేంద్రంగా తమ కార్యకలాపాల్ని మొదలుపెడతామని తెలిపారు. ఇలా దావోస్ ద్వారా ఏపిలోకి అనేక పెట్టుబడుల్ని తీసుకొస్తున్నారు సీఎం జగన్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి