iDreamPost

జగన్ సర్కార్‌కు ప్రపంచబ్యాంకు ప్రశంసలు

జగన్ సర్కార్‌కు ప్రపంచబ్యాంకు ప్రశంసలు

అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పాలనలో దూకుడు చూపిస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ పై ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసలు తెలిపింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ సిఎస్ నీలం సాహ్నితో భేటీ అనంతరం ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యింది. ఈ భేటీలో ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కీలక పథకాలను, కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ముఖ్యమంత్రి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమని ప్రశంసిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రపంచబ్యాంకు పాలు పంచుకునేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను, ప్రశంసించిన వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు మరోసారి ముఖ్యమంత్రితో భేటీ అవ్వనున్నట్లు సమాచారం.ఈ భేటీలో వరల్డ్‌ బ్యాంకు దక్షిణాసియా మానవ వనరుల అభివృద్ధి విభాగం రీజనల్‌ డైరెక్టర్‌ షెర్‌బర్న్‌ బెంజ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. త్వరలో జరగబోయే భేటీలో కలిసి పనిచేసే ప్రాజెక్టులను గుర్తించనున్నట్లు తెలుస్తోంది. భేటీలో భాగంగా మానవ వనరులపై పెట్టుబడి పెట్టడం ద్వారా అభివృద్ది ఫలితాలు త్వరగా వస్తాయని ప్రపంచబ్యాంకు ప్రతినిధులు అభిప్రాయపడినట్లు తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి