iDreamPost

ప్రారంభమైన కౌంటింగ్.. తొలి ఫలితం ఎప్పుడు వస్తుందంటే..

  • Published Dec 03, 2023 | 8:23 AMUpdated Dec 03, 2023 | 8:23 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పర్వమైన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. మరి ముందుగా ఏ ఓట్లను లెక్కిస్తారు.. తొలి ఫలితం ఎప్పుడు వెల్లడవుతుంది అంటే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పర్వమైన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. మరి ముందుగా ఏ ఓట్లను లెక్కిస్తారు.. తొలి ఫలితం ఎప్పుడు వెల్లడవుతుంది అంటే..

  • Published Dec 03, 2023 | 8:23 AMUpdated Dec 03, 2023 | 8:23 AM
ప్రారంభమైన కౌంటింగ్.. తొలి ఫలితం ఎప్పుడు వస్తుందంటే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పర్వమైన ఓట్ల లెక్కింపు ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం (డిసెంబర్ 3) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. నేడే నేతల భవితవ్యంతో పాటు.. రాష్ట్రాన్ని రానున్న ఐదేళ్లు పాలించే నాయకులు ఎవరో వెల్లడి కానుంది. కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం అన్నీ ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో 13 కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ముందగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ను ప్రారంభించారు. ఈ క్రమంలో తొలి రౌండ్ ఫలితాలు ఏ సమయం వరకు వెల్లడవుతాయి.. కౌంటింగ్ ప్రక్రియ ఎలా సాగనుంది అనే వివరాలు..

ముందుగా సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియతో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇది పూర్తి కావడానికి అరగంట నుంచి గంట సమయం పడుతుంది.. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించడం మొదలుపెడతారు. ఈ లెక్కన ఉదయం 9-9.30 మధ్యలో తొలి రౌండ్ ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈసారి ప్రతి ఈవీఎంను మూడుసార్లు లెక్కించాల్సి ఉంటుందని.. అందువల్ల ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, పోలింగ్ కేంద్రాల సంఖ్య ఆధారంగా కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు.

ఈవీఎంలో ఓట్ల లెక్కింపులో భాగంగా ఒక రౌండ్ కు సంబంధించి అర గంట పడుతుంది. అన్ని టేబుళ్ల లెక్కింపు పూర్తైన తర్వాత ఆ రౌండ్‌ ఫలితంపై స్పష్టత వస్తుంది. అన్ని టేబుళ్ల వద్ద ఫలితాలు వచ్చాక వాటి మొత్తాన్ని తీసుకొని, ఆ రౌండ్‌ ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు. వాటన్నింటినీ తిరిగి స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన తర్వాత రెండో రౌండ్‌ కౌంటింగ్ మొదలవుతుంది.

భారీ భద్రత మధ్య..

ఈ లెక్కన మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు ఫలితాలపై ఒక అంచనాతో పాటు నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారో వెల్లడవుతుంది. దీన్ని బట్టి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఒక అంచానకు రావచ్చు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల ముందు కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. లోపలా, బయటా సీసీ కెమెరాలను అమర్చి ప్రత్యేక నిఘా పెట్టారు. ఒకే ఎంట్రీ, ఎగ్జిట్‌తో పాటు స్ట్రాంగ్ రూమ్‌కు డబుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఒక్కో టేబుల్‌కు ఆరుగురు అధికారులు ఉంటారు. మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. బరిలో నిలిచిన అభ్యర్థుల తరఫున ఒక్కో కౌంటింగ్‌ ఏజెంట్‌కు ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అవకాశం ఇస్తారు. పోటీ చేసే అభ్యర్థి దరఖాస్తు మేరకు కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకానికి రిటర్నింగ్‌ అధికారి అనుమతి ఇస్తారు. ఓట్ల లెక్కింపు సిబ్బంది మినహా మిగతా వారెవరికీ కౌంటింగ్ హాల్‌లోకి ప్రవేశించిందుకు వీల్లేదు. టేబుళ్ల వెనుక వైపు ఇనుప కంచె బిగిస్తారు. టేబుల్ ఎదురుగా కంచె అవతల అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లు కూర్చొని బయట నుంచి ఫలితాలను గమనిస్తుంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి