iDreamPost

నాలుగు రోజుల కిందటే సీమంతం.. ఇంతలోనే విషాదం!

నాలుగు రోజుల కిందటే సీమంతం.. ఇంతలోనే విషాదం!

ఆమె.. తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో ఊహించుకుంది. త్వరలో తమ ఇంటికి బుడ్డి పాపాయి రాబోతుందని  ఆమె సంతోషంలో ఉంది. ఈ క్రమంలోనే నాలుగు రోజుల కిందటే ఆమెకు అంగరంగం వైభవంగా సీమంతం చేశారు.  అయితే ఓ మైనర్ చేసిన తప్పుకు ఈ నిండు గర్భిణి బలైంది.  అతివేగంతో ఆటోను నడిపి.. ఈ మహిళ వెళ్తున్న బైక్ ను ఢీ కొట్టాడు.  ఈ ప్రమాదంలో గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

గుంటూరు జిల్లా పొన్నూరు మండల జడవల్లి గ్రామానికి చెందిన పందింటి పవన్ కుమార్ కు కాకకుమాను మండలం పాండ్రపాడుకు చెందిన వాణి(22)తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. పవన్‌ విశాఖపట్నం పరిధి గాజువాకలో చిరువ్యాపారిగా జీవనం సాగిస్తున్నాడు. వీరిద్దరి కాపురం ఎంతో సంతోషంగా సాగుతుంది. ఇలాంటి సమయంలో వారింట మరో సంతోషకరమైన వార్త తెలిసింది. అదే వాణి గర్భవతి అని తెలిసింది. దీంతో వాణి తొలిసారి గర్భం దాల్చడంతో కొద్దికాలం కిందట పుట్టింటికి వచ్చింది. అలానే నాలుగు రోజుల క్రితం సీమంతం చేశారు. ప్రస్తుతం వాణి 9 నెలల గర్భిణి. పొన్నూరులోని ప్రైవేటు వైద్యుడి వద్ద వైద్య పరీక్షలు చేయించుకునేందుకు సోమవారం సాయంత్రం భర్తతో కలిసి బైక్ పై ఆస్పత్రికి బయలుదేరింది. పొన్నూరు మండలంలోని ఉప్పరపాలెం శివారుకు వచ్చేసరికి వారి బైక్ ను వెనుక నుంచి మైనర్‌ నడుపుతున్న ఆటో అతివేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వాణికి తీవ్రంగా గాయాలయ్యాయి. అదే సమయంలో ఆమెకు నొప్పులు రావడంతో.. వాటిని భఱించలేక కేకలు వేసింది. పవన్‌కుమార్‌ ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం  ఇవ్వడంతో.. వారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే  గాయపడిన వాణిని పొన్నూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి  విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పొన్నూరు ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతురాలి భర్త.. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పొన్నూరు  పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: ఒక్కగానొక్క కూతురు.. స్నానం చేసేందుకు బాత్రూమ్ కు వెళ్లి..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి