iDreamPost

విక్రమ్ సినిమా ప్రదర్శన.. థియేటర్లో మంటలతో కాలిపోయిన తెర..

విక్రమ్ సినిమా ప్రదర్శన.. థియేటర్లో మంటలతో కాలిపోయిన తెర..

కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ హీరోలతో పాటు మరో స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్‌లో పెట్టి భారీ మల్టీస్టారర్ విక్రమ్ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ లో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఈ సినిమా భారీ విజయం సాధించి ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లని సాధించి మరింత దూసుకెళ్తుంది. ఈ సినిమా విజయంపై కమల్ హాసన్ చాలా సంతోషంగా ఉన్నారు. దీంతో సినిమాలో భాగమైన వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నారు.

అయితే తాజాగా విక్రమ్ సినిమా ప్రదర్శించే ఓ థియేటర్లో మంటలు చెలరేగి తెర కాలిపోయింది. పుదుచ్చేరిలోని కాలాపేట్‌లో ఉన్న జయా సినిమా హాల్‌లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం రాత్రి ఫస్ట్ షో జరుగుతున్న సమయంలో ఈ అపశృతి నెలకొంది. విక్రమ్ సినిమా అయిపోవస్తుంది అనగా క్లైమాక్స్ లో సూర్య కనిపించే సమయానికి మంటలు చెలరేగాయి. స్క్రీన్ కి ఒక వైపు నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో మంటలను చూసి ప్రేక్షకులు భయపడి పరుగులు తీశారు. థియేటర్ యాజమాన్యం, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటల్ని ఆర్పేశారు.

ఈ విషయం తెలిసి పోలీసులు కూడా థియేటర్ వద్దకి చేరుకున్నారు. ఈ సంఘటన ఎలా జరిగిందని అక్కడున్న వారిని విచారించారు పోలీసులు. కొంతమంది దీనికి షార్ట్ సర్క్యూట్ కారణం అని తెలుపగా, మరి కొంతమంది సూర్య అభిమానులు సూర్య ఎంట్రీ సమయంలో కర్పూరం వెలిగించారని, బాణాసంచా కాల్చారని అందువల్లే మంటలు చెలరేగాయని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ తెర మాత్రం పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది త్వరగా రావడం వల్ల తెరతోనే ఆగిపోయిందని లేదంటే థియేటర్ కూడా కాలిపోయేదని అంటున్నారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి