ప్రముఖ పారిశ్రామికవేత్త, బాలాజీ హేచరీస్ అధినేత సుందర నాయుడు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి సుందర నాయుడు కాగా 1936 జూలై 1న ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కంపల పల్లెలో జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుందర నాయుడు బొంబాయి వెటర్నరీ యూనివర్సిటీలో బీవీఎస్సీ పూర్తి చేశారు. బీవీఎస్సీ పూర్తయిన తర్వాత కొంతకాలం పీలేరులో పశు వైద్యుడిగా ప్రభుత్వ ఉద్యోగం చేశారు. పశు వైద్యుడిగా సుందర నాయుడు చిత్తూరు, అనంతపురం, అలాగే తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాల్లో విశేష సేవలందించారు.
ఈ క్రమంలో అక్కడి రైతులకు దగ్గరయి కోళ్ల పెంపకం వలన లాభాలు తెలుసుకున్న ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1967లో కోళ్ల పరిశ్రమలను ఏర్పాటు చేసే విధంగా అన్ని ఊర్లకు వెళ్లి అక్కడి రైతులను ఒప్పించడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో కోడి పిల్లల దిగుమతి సమస్యగా మారడంతో 1972లో ‘బాలాజీ హేచరీస్’ స్థాపించి పౌల్ట్రీ రంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పౌల్ట్రీ రంగం పుంజుకుంటోంది అనుకుంటుండగా కోళ్ల మేతకు కొరత ఏర్పడడంతో 1989లో దేశంలోనే అతి పెద్దదైన వీఎస్ఎన్ ఫీడ్స్ సంస్థను స్థాపించి దాణా కొరతను కొంతవరకు తీర్చగలిగారు.
ఆ అనంతర కాలంలో 2006లో ‘వీఎస్ఎన్ చికెన్ సెంటర్స్’ను ఏర్పాటు చేశారు. పౌల్ట్రీ రంగానికి సుందర నాయుడు చేసిన కృషికిగానూ అనేక విధాలుగా గౌరవింపబడ్డారు. పుణేలోని డాక్టర్ బీవీరావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపక ట్రస్ట్రీగా వ్యవహరించారు. ‘నెక్’ లైఫ్ టైమ్ ఇన్వైటీ మెంబర్ గా, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ లైఫ్ టైమ్ ఇన్వైటీ మెంబర్ గా, ఇంటర్నేషనల్ పౌల్ట్రీ సైన్స్ అసోసియేషన్ మెంబర్ గా, ఎగ్ కౌన్సిల్ సభ్యుడిగానూ విశేష సేవలందించారు. ఇక ఆయన ఉమ్మడి ఏపీ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగా అందులో శైలజా రామోజీగ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు పెద్ద కోడలు. ఆమె ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్కి ఎండీగా ఉన్నారు. మొన్ననే శైలజా కిరణ్ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఇంతలోనే ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.