Tirumala: శ్రీవారి భక్తులకు TTD అలర్ట్.. లడ్డూ కావాలంటే.. అది తప్పనిసరి

TTD-Aadhaar Card, Laddu Prasadam: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. లడ్డూ ప్రసాదానికిసంబంధించి కీలక అప్డేట్ విడుదల చేసింది. ఆ వివరాలు..

TTD-Aadhaar Card, Laddu Prasadam: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. లడ్డూ ప్రసాదానికిసంబంధించి కీలక అప్డేట్ విడుదల చేసింది. ఆ వివరాలు..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భారీ ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. శ్రీవారి హుండీకి నిత్యం కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇక తిరుమల అనగానే.. శ్రీవారితో పాటుగా.. అక్కడ లభించే లడ్డూ ప్రసాదం కూడా అంతే ఫేమస్. బంధువులు, స్నేహితులు ఎవరైనా సరే.. తిరుమల వెళ్తాం అంటే.. ప్రతి ఒక్కరు తమకో లడ్డూ తేవాలని రిక్వెస్ట్ చేస్తుంటారు. తిరుమల లడ్డూ రుచికి వేరే ఏది సాటి రాదు. ఈ క్రమంలో తిరుమల లడ్డూకు సంబంధించి టీటీడీ భక్తులకు కీలక అలర్ట్ జారీ చేసింది. ఆ వివరాలు..

నేటి కాలంలో ప్రభుత్వ పథకాలు, స్కీములు, సాయం పొందాలంటే.. ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి లడ్డూ జారీ విధానంలో పలు మార్పులు తెచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు లడ్డూ ప్రసాదం కావాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించాల్సి  ఉంటుంది. తాజాగా టీటీడీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డు సమర్పించే భక్తుడికి ఒక లడ్డూకు, మరో లడ్డూ అదనంగా ఇవ్వనున్నట్టు టీటీడీ పేర్కొంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం దుర్వినియోగం అవుతోందని భావించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ స్పష్టం చేసింది.

నేటి నుంచి అనగా ఆగస్టు 29, 2024 గురువారం నుంచి లడ్డూ ప్రసాదం పొందాలంటే ఈ ఆధార్ తప్పనిసరి విధానం అమలులోకి వస్తుందని టీటీడీ ప్రకటించింది. ప్రస్తుతం రోజూ దాదాపు 3.50 లక్షల లడ్డూలు టీటీడీ విక్రయిస్తోంది. అలానే తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టోకెన్లను.. ఇకపై లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ అంగప్రదక్షిణ టోకెన్లు కావాల్సిన భక్తులు గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత వీరికి సాయంత్రం 5 గంటలకు లాటరీ తీసి  టికెట్లు కేటాయిస్తారు.

Show comments