iDreamPost

ఆదివాసిల కల నెరవేర్చిన KCR.. ఒక్క నిర్ణయంతో లక్ష మందికి పైగా మేలు!

  • Published Jun 30, 2023 | 2:51 PMUpdated Jun 30, 2023 | 2:51 PM
  • Published Jun 30, 2023 | 2:51 PMUpdated Jun 30, 2023 | 2:51 PM
ఆదివాసిల కల నెరవేర్చిన KCR.. ఒక్క నిర్ణయంతో లక్ష మందికి పైగా మేలు!

రాష్ట్రంలో ఏళ్ల తరబడి పరిష్కృతం కాకుండా ఉన్న సమస్యకు ఒ‍క్క నిర్ణయంతో పరిష్కారం చూపారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఏళ్ల తరబడి ఎదురు చూస్తోన్న ఆదివాసిల కలను నెరవేర్చారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ రైతుల కల నేడు సాకారం కానుంది. వీరికి పట్టా పుస్తకాలు పంపిణీ చేసేందుకు గిరిజన సంక్షేమ, అటవీ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆసిఫాబాద్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అర్హులైన ఆదివాసీ రైతులందరిక పట్టాలు అందజేయనున్నారు. మిగతా జిల్లాల్లో.. ఆయా జిల్లా మంత్రుల చేతుల మీదుగా అర్హులకు పట్టా పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.

పోడు భూముల్లో సాగుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా.. 1,50,012 మంది రైతులు సుమారు 4,05,601 ఎకరాల పోడు భూమిలో సాగు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా సాగుచేసుకునేవారంతా గిరిజనులు, ఆదివాసీలే. దాంతో ప్రభుత్వం వారు సాగు చేసుకుంటున్న పోడు భూములకు సంబంధించి పట్టాలు మంజూరు చేయనుంది.

శుక్రవారం ఆసిఫాబాద్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం సీఎం కేసీఆర్‌ బేగంపేట్‌ విమానాశ్రయం నుంచి ఆసిఫాబాద్‌ బయలుదేరారు. పోడు భూములకు సంబధించి అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 50,595 మంది రైతులు 1,51,195 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో 24,972 మంది రైతులు, ఆసిఫాబాద్‌ జిల్లాలో 15,254 మంది రైతులు పట్టాల కోసం దరఖాస్తులు సమర్పించారు.

ఆసిఫాబాద్‌ చేరుకున్న తర్వాత కేసీఆర ముందుగా పట్టణంలో కుమరంభీం విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సమీపంలోని పిల్లల పార్కులో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి కోట్నాక భీంరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్పీ కార్యాలయాన్ని, కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. తిరిగి శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ చేరుకుంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి