iDreamPost

అఖిల ప్రియను నా కూతురులా చూసుకున్నా..: ఏవీ సుబ్బారెడ్డి

అఖిల ప్రియను నా కూతురులా చూసుకున్నా..: ఏవీ సుబ్బారెడ్డి

మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు ఓ న్యూస్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన అఖిల ప్రియపై ఆరోపణలు గుప్పించారు. మహిళ ముసుగులో అఖిల ప్రియ ఫ్యాక్షన్‌ రాజకీయాలకు తెరలేపిందని మండిపడ్డారు. రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సూడో నక్సలైట్‌ సంజోరెడ్డిలతో కలసి అఖిలప్రియ తనను చంపించాలని ప్లాన్‌ వేసిందని ఆరోపించారు. అందు కోసం 50 లక్షల రూపాయల సుఫారి ఇచ్చేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకుందన్నారు. వారికి అఖిల ప్రియ అనుచరుడు మాదా శ్రీను డబ్బులు ఇచ్చాడని ఆరోపించారు.

అఖిల ప్రియను తన కూతురులా చూసుకున్నానని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. తన ముగ్గురు కూతుళ్లతో సమానంగా అఖిల ప్రియను పేమగా చూసుకున్నానని చెప్పారు. అయినా రాజకీయ కుట్రతో తనను హత్య చేసేందుకు ప్రణాళిక రచించిందని ఆరోపించారు. ఈ విషయం పార్టీ అధినేత దృష్టికి తీసుకెళతానని చెప్పారు. కుట్రను భగ్నం చేసిన కాపాడిన పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. తక్షణమే అఖిల ప్రియను, ఆమె భర్త భార్గవరాముడిని ఆరెస్ట్‌ చేయాలని ఏవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఏవీ సుబ్బారెడ్డి వ్యవహరించారు. భూమా మరణం తర్వాత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అఖిల ప్రియ మంత్రి అయ్యారు. గత ఎన్నికలకు ముందు ఏవీ సుబ్బారెడ్డి, అఖిల ప్రియకు మధ్య విభేదాలు వచ్చాయి. ఎన్నికల్లో టిక్కెట్‌కు ఏవీ సుబ్బారెడ్డి పోటీ రావడంతో ఈ విభేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే ఆళ్లగడ్డ టీడీపీ టిక్కెట్‌ అఖిల ప్రియకే దక్కింది. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు. ఏవీ సుబ్బారెడ్డి వల్లే అఖిల ప్రియ ఓడిపోయిందన్న ప్రచారం సాగింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల కడపలో ఓ సుఫారీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణ చేయగా.. వారు ఏవీ సుబ్బారెడ్డి హత్యకు ప్లాన్‌ చేసినట్లు తేలింది. దీని వెనుక అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ రాముడు ఉన్నారే ఆరోపణలతో పోలీసులు వారిని విచారించేందుకు యత్నించారు. అయితే కొంత కాలం వారిద్దరు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల మళ్లీ వెలుగులోకి వచ్చారు. తన హత్యకు అఖిల కుట్ర పన్నారని అనుమానంతో తాజాగా ఏవీ సుబ్బారెడ్డి ఆమెపై విమర్శలు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి