Dharani
Dharani
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎంతో అరుదైన ఈ దిబ్బలను రక్షించాల్సింది పోయి.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పైగా ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాల్లో బఫర్ జోన్ ఏర్పాటు చేసి.. రక్షణ కల్పించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా మారింది. ఎందుకంటే.. భౌగోళిక వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బలకు ఇప్పుడనే కాదు భవిష్యత్తులో కూడా ఎలాంటి నష్టం కలగకుండా సంరక్షించడానికి అక్కడ బఫర్ జోన్ ఏర్పాటు చేసి.. వాటికి దూరంగా అభివృద్ధి పనులు చేపట్టింది వైసీపీ సర్కార్. ఎర్రమట్టి దిబ్బ సంరక్షణ కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకోగా.. ఇప్పుడు ఎర్రమట్టి దిబ్బలను కాపాడాలంటూ హంగామా చేస్తోన్న పవన్ కళ్యాణ్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారు.
పైగా ప్రభుత్వం ఎర్రమట్టి దిబ్బలకు నష్టం కలిగించేలా అక్కడ అభివృద్ధి పనులు చేస్తోందంటూ ఆరోపిస్తోన్న పవన్ కళ్యాణ్ ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. వాస్తవంగా కొత్త వలసలో భూసమీకరణ చేపట్టిందే చంద్రబాబు సర్కార్. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ దాచినా జనాలు మాత్రం మర్చిపోరు. పైగా వైసీపీ ప్రభుత్వం సమీకరించింది.. ఇక్కడ డీ పట్టాలు పొంది దశాబ్దాలుగా జీడీ మామిడి తోటలు సాగు చేసుకుంటున్న రైతుల భూములనే. ఇక పవన్ ఆరోపిస్తున్నట్లు.. ప్రభుత్వం సమీకరించింది ఎర్రమట్టి దిబ్బలే అనుకుంటే.. వాటికి.. డీ పట్టాలని ఎలా ఇస్తుంది అన్న కనీస అవగాహన ఇటు పవన్కి గాని.. అటు టీడీపీ నేతలకు కానీ లేకపోవడం విచారకరం.
పైగా పవన్ వ్యాఖ్యలని.. ఏకంగా టీడీపీ రైతులే తప్పు పడుతున్నారు. ఎర్రమట్టి దిబ్బలను నాశనం చేస్తున్నారంటూ టీడీపీ, జనసేన చేస్తోన్న ఆందోళనల్ని.. టీడీపీకి చెందిన రైతులే ఖండిస్తున్నారు. అసలు ఇక్కడ భూ సమీకరణ ప్రక్రియ మొత్తం జరిగిందే టీడీపీ హాయాంలో అయితే.. ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్లు మాట్లాడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. టీడీపీకి చెందిన పాసి నర్సింగరావు అనే రైతు మాట్లాడుతూ.. ‘‘మా టీడీపీ హయాంలోనే దీనిపై జీవో వచ్చింది. అప్పుడే మేము పూలింగ్కు భూములు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. మాకు కొత్త వలస దగ్గర 5 ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించి సుమారు 40 ఏళ్ల క్రితమే ప్రభుత్వం మాకు డీ పట్టాలిచ్చింది’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘అంతేకాక రైతులందరం కూర్చుని.. పూలింగ్లో భూమి ఇస్తే.. ఎంత పరిహారం అడగాలో మాట్లాడుకున్నాం. గ్రామ సభలకు రైతులందరం హాజరయ్యాం. అందరకీ మంచి పరిహారం ఇస్తాము అని తెలిపారు. అయితే అప్పట్లో ఈ ప్రక్రియ ఆలస్యమయ్యింది. ఇదంతా అప్పుడే జరిగింది. పవన్ కళ్యాణ్ వచ్చి ఇప్పుడు ధ్వంసం చేస్తున్నారు అని మాట్లాడటం సరికాదు’’ అని తెలిపారు. మరి టీడీపీ రైతుల వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి అంటున్నారు జనాలు.