iDreamPost

పీకే ప్లాన్ ఇచ్చాడు.. తేల్చాల్సిన బాధ్యత ఆ ముగ్గురిపై పెట్టిన సోనియా

పీకే ప్లాన్ ఇచ్చాడు.. తేల్చాల్సిన బాధ్యత ఆ ముగ్గురిపై పెట్టిన సోనియా

2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఇచ్చిన సూచనలు, ప్రణాళికలను పరిశీలించేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ సీనియర్‌లు ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, మల్లికార్జున్‌ ఖర్గేలతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. వారంలోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది.

ఏప్రిల్ 16న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో కిషోర్ మూడు గంటలపాటు ప్రజెంటేషన్ చేశారు. దీనికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, మల్లికార్జున్ ఖర్గే, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, KC వేణుగోపాల్, జైరాం రమేష్, అజయ్ మాకెన్ హాజరయ్యారు. ప్రశాంత్ కిషోర్ ప్రెజెంటేషన్‌లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పొరపాట్లను వివరించాడు. పార్టీ విజయవంతం కావడానికి ప్రత్యామ్నాయ ప్రణాళికను అందించారు.

లోక్‌సభ లోని 543 స్థానాలలో బలం 370 మాత్రమేనని.. గెలవగల స్థానాలపై పార్టీ వనరులను కేంద్రీకరించాలని ఆయన కాంగ్రెస్ అధినాయకత్వానికి సూచించారు. సరైన మార్కెటింగ్ లేకుండా కాంగ్రెస్ ఉండిపోయిందని పీకే అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పార్టీ మీడియా వ్యూహంపై ఆయన తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. బూత్ స్థాయిలో కార్యకర్తలను ప్రోత్సహించడం, సాధికారత కల్పించడం ద్వారా ప్రత్యర్థులను ఎదుర్కోవచ్చని సూచించారు.

ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో సొంతంగా పోరాడాలని, ఆంధ్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకోవాలని సూచించారు. ప్రజెంటేషన్ అనంతరం సోనియా నేతల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రతిపాదన పట్ల దిగ్విజయ్ సింగ్, ఎకె ఆంటోనీ పెద్దగా ఆసక్తి కనబరచలేదని తెలుస్తోంది. పచ్‌మరి, సిమ్లాలో పార్టీ ఇదే చెప్పిందని దిగ్విజయ్ అన్నారు. ప్రశాంత్ ప్రతిపాదనలో పేర్కొన్న చాలా అంశాలు 2014లో పార్టీ ఓడిపోయిన తర్వాత తన నివేదికలో పేర్కొన్న అంశాలే ఉన్నాయని ఆంటోనీ చెప్పారు. కిషోర్ అందించిన ఆలోచనలకు జైరాం రమేష్ ప్రశంసలతో ముంచెత్తారు. అవి ప్రయత్నించాలని చెప్పారు.

అయితే 2024 సార్వత్రిక ఎన్నికలకు వ్యూహరచన చేసే పూర్తి బాధ్యతను ఆయనకు అప్పగించే ముందు, త్వరలో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో తన ప్రణాళిక సమర్థతను నిరూపించుకోవాలని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో పీకే ప్రణాళికపై త్రిసభ్య కమిటీ ఏమి చేస్తుంది..? సోనియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి