iDreamPost

బ్లాక్ బస్టర్ రీ రిలీజులకు బ్రహ్మరథం

బ్లాక్ బస్టర్ రీ రిలీజులకు బ్రహ్మరథం

రీ రిలీజుల పర్వం ఇకపై టాలీవుడ్ లో రెగ్యులర్ గా కొనసాగేలా ఉంది. పోకిరికి వచ్చిన రెస్పాన్స్, జల్సా సృష్టించిన రికార్డులు చూసి ఇప్పుడు పాత బ్లాక్ బస్టర్ల దుమ్ము దులిపి బిగ్ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. మొన్న కృష్ణ ఫ్యాన్స్ సింహాసనంని 8K క్వాలిటీతో రీ మాస్టర్ చేసి డాల్బీ సౌండ్ తో 2023లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మహేష్ అభిమానులు వచ్చే ఏడాది ఒక్కడు రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 8న సరికొత్త సాంకేతికతతో వరల్డ్ వైడ్ థియేటర్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మంచి ట్రెండింగ్ అయ్యింది.


కథ ఇక్కడితో అయిపోలేదు. బిజినెస్ మెన్, ఖలేజా, అతడులను సైతం ఇదే తరహాలో వెండితెరపై మరోసారి తీసుకురాబోతున్నారు. వీడియో ఆడియోలో ఎక్కడా రాజీ లేకుండా టెక్నాలజీ వాడుతున్నారు. ఆ మధ్య తమ్ముడు హైదరాబాద్ ఐమ్యాక్స్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మంచి వసూళ్లు రాబట్టింది. ఘరానా మొగుడు హౌస్ ఫుల్స్ పడిన సెంటర్లున్నాయి. అందుకే ఇతర స్టార్ల ఫ్యాన్స్ కూడా ఈ ట్రెండ్ ని సీరియస్ గా విశ్లేషించి తమ హీరోల క్లాసిక్స్ ఏవి అందుబాటులో ఉన్నాయి, నెగటివ్స్ ఎక్కడ దొరుకుతాయి, నిర్మాతలు ఎక్కడ ఉన్నారు లాంటి ఆరాలు తీస్తూ స్క్రీనింగ్ కోసం డిస్ట్రిబ్యూటర్లను సంప్రదిస్తున్నారు. ఆదాయం కూడా గ్యారెంటీ కదా.

కొత్త సినిమాలతో పోటీగా ఇవి వసూళ్లు రాబట్టడం మాత్రం షాక్ కలిగించేదే. తాపీగా ఇంట్లో ఫ్రీగా చూసే వెసులుబాటుని వదులుకుని ఇలా నలుగురితో కలిసి హాళ్లలో చూసేందుకు ఫ్యామిలీస్, లేడీ ఫ్యాన్స్ కూడా ఉత్సాహపడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటి టీనేజ్ యువత వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు పైన చెప్పిన బ్లాక్ బస్టర్స్ ని థియేటర్ లో చూసి ఉండరు. వాళ్లకు మాత్రం ఈ ఎక్స్ పీరియన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. 2010లో మాయాబజార్ ని కలర్ లో రీ రిలీజ్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దాన్ని మించిపోయేలా ఈ పునఃవిడుదల ప్రవాహం ఓ రేంజ్ లో సాగిపోతోంది. అక్టోబర్ 23 ప్రభాస్ బిల్లా 4K వెర్షన్ ని తీసుకురాబోతున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి