idream media
idream media
సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలో జయాపజయాలను పక్కనపెడితే పృథ్విరాజ్ భారతదేశపు చివరి హిందూ రాజుగా అక్షయ్ కుమార్ సినిమా చెబుతోంది. మరైతే దక్షణభారతావనిని ఏలిన కృష్ణదేవరాయలు ఎవరు? ఔరంగజేబును ఎదిరించిన శివాజీ ఏమైనట్లు? 23 యుద్ధాల్లో 22 చోట్ల విజయం సాధించిన హేము సంగతేంటి?
పృథ్వీరాజ్ పై పరిశోధన చేయడానికి దశాబ్దం కంటే ఎక్కువ సమయం పట్టిందని, దర్శకుడు 18 ఏళ్లపాటు చరిత్రను తవ్వితీసి, సినిమాగా తీర్చిదిద్దాడని అక్షయ్ కుమార్ గొప్పగా చెప్పుకున్నా, సామ్రాట్ పృథ్వీరాజ్ చారిత్రక దోషాల్లో చిక్కుకున్నాడు. సినిమా పోస్టర్లను చూస్తే మాత్రం పృథ్వీరాజ్ చౌహాన్ ‘భారతదేశానికి చివరి హిందూ రాజు’ అని చెప్పుకొంటున్నాయి. ఇక్కడే చాలామంది చరిత్రకారులకు అభ్యంతరముంది. పృథ్వీరాజ్ చౌహాన్ చివరి ‘హిందూ’ రాజు, కాదంటే భారతదేశపు చివరి రాజు కాదని, ఆ తర్వాత భారతదేశంలో దక్షణ, పశ్చిమ ప్రాంతాలను ఏలిన రాజులను గురించి చెప్పేసరికి అటువైపు నుంచి స్పందన రావడంలేదు.
అజ్మీర్లోని చౌహాన్ రాజవంశానికి చెందిన రాజపుత్ర యోధుడు 1177 లో సింహాసనాన్ని అధిష్టించాడు. అతని కాలమంతా యుద్ధాలతోనే సరిపోయింది. మహ్మద్ ఘోరీతో యుద్ధం చేసి 1192లో మరణించాడు. మరి ఆతర్వాత ఎవరూ హిందూ రాజులే లేరా? విజయనగర సామ్రాజ్యం గొప్పగా ఎదిగింది. శివాజీ పదుల కొద్ది కోటలను పట్టుకున్నారే? వీళ్లెవరూ రాజులుకదా? అంతెందుకు విజయనగర పాలకులు తమను తాము హిందూ రాజులుగా పిలిచుకొనేవాళ్లు. బాలీవుడ్ దృష్టిలో భారతదేశం అనుకునేది ఢిల్లీ పీఠమేనా? ఈలెక్కన ఢిల్లీని పట్టుకోలేనందున శివాజీ హిందూ రాజు కాదా? ఈ అహంభావపు వాదనను ఎవరు ఒప్పుకొంటారు?
తొమ్మది శతాబ్ధాలక్రితం నాటి రాజుకు ఈనాటి మతాన్ని జోడించడమేంటి? ఇది చరిత్రకు పట్టించిన వైపరీత్యమేనని విద్యావేత్తలు అంటున్నారు. ఈనాటి దుర్భణితో ఆనాటి చరిత్రను చూడటం మంచిదేనా? ఆనాటి రాజులు మతాలను అవసరార్ధం సమ్మిళితం చేసుకొని ఏలుబడి సాగించేవారన్నది చరిత్రకారుల మాట. ఔరంజేబు మినహా మిగిలిన మొఘల్ చక్రవర్తలు హిందూమతానికి ఎంతోకొంత ప్రాధ్యాన్యతనిచ్చేవారన్నది మరికొందరి మాట.
హిందూ రాజు హేము సంగతేంటి ?
పృథ్వీరాజ్ మాత్రమే చివరి హిందూ రాజు అన్న అక్షయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై హర్యానా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పానిపట్ నగర అడ్మినిస్ట్రేటివ్ వెబ్సైట్ రాజు హేమును, స్వాతంత్ర సమరయోధుడిగా వర్ణిస్తుంది. అక్బర్ చేతిలో హేము చనిపోకపోతే భారతదేశ చరిత్ర వేరుగా ఉండేదని చరిత్రకారులు అంటారు. హేము లేదంటు సామ్రాట్ హేమ్ చంద్ర విక్రమాదిత్యను భారతదేశ చివరి హిందూ చక్రవర్తిగా పానిపట్ వాసులు ఇప్పటికీ చెప్పుకొంటారు.
హేము 7 అక్టోబర్ 1556 నుండి నవంబర్ 5, 1556 వరకు కేవలం ఒక నెల మాత్రమే పాలించాడు. ఢిల్లీ యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని ఓడించడంతో ఢిల్లీకి రాజుగా ప్రకటించుకున్నాడు. ఆగ్రా , ఢిల్లీని స్వాధీనం చేసుకున్న తరువాత, అతను ‘విక్రమాదిత్య’ అనే బిరుదును తీసుకున్నాడు. అక్కడ తన స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాలని అనుకున్నాడు. ఇది అధికారం కోసం చేసిన పోరాటమేకాని, మతపరమైన యుద్ధం కాదు, కారణం ఒక్కటే, హేము తన ముస్లిం చక్రవర్తి ఆదిల్ షా కోసం 22 యుద్ధాల్లో గెలిచాడని కొందరి అంటారు.
కాని రెండో పానిపట్ యుద్ధంలో మొఘల్ సేనలు చుట్టుముట్టి చంపేశాయి.