iDreamPost

బీఆర్ఎస్ కి వరంగా మారిన కాంగ్రెస్ అసంతృప్తి నేతలు!

  • Published Oct 30, 2023 | 12:36 PMUpdated Oct 30, 2023 | 12:36 PM

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా పార్టీకి ఎంతగానో సేవ చేస్తూ భంగపడిపోయిన నేతలు వరుసగా రాజీనామాలు చేయడం తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా పార్టీకి ఎంతగానో సేవ చేస్తూ భంగపడిపోయిన నేతలు వరుసగా రాజీనామాలు చేయడం తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.

  • Published Oct 30, 2023 | 12:36 PMUpdated Oct 30, 2023 | 12:36 PM
బీఆర్ఎస్ కి వరంగా మారిన కాంగ్రెస్ అసంతృప్తి నేతలు!

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పార్టీని నమ్ముకొని వస్తున్న వారికి ఆశించిన టికెట్ దక్కక పోవడంతో తీవ్ర నిరాశలో వేరే పార్టీలోకి మారిపోతున్నారు. దేశంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు జట్ స్పీడ్ లో మారిపోతున్నాయి. ప్రధాన పార్టీలు అయిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ మారుతున్నారు. దీంతో అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు అసంతృప్తి నేతలను బుజ్జగించే పనిలో ఉన్నా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇదంతా ఒక ఎత్తైతే.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార పార్టీకి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు వరుసగా గులాబీ కండువా కప్పుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా రిలీజ్ చేయడం.. బి-ఫారమ్ లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ లు మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 100 మంది అభ్యర్థుల జాబితా ఓకే చేస్తే.. బీజేపీ మాత్రం 53 మంది పేర్లు మాత్రమే ఖరారు చేసింది. అయితే కాంగ్రెస్ లో మరో 19 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సీట్లు దక్కుతాయని భావించిన సీనియర్, జూనియర్ నేతలు లిస్టులో తమ పేర్లు రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ని వీడి మల్లీ జాయిన్ అయిన వాళ్లకు టికెట్ కేటాయించడంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో తమ పేరు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతూ అధికార పార్టీ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ హయాంలో ఒక్క వెలుగు వెలిగిన మాజీ మంత్రి నాగం జనార్థన్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆదివారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు. దీంతో వీరంతా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నట్లు కన్ఫామ్ అయ్యింది.  శుక్రవారం కాంగ్రెస్ 45 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఫైనల్ చేసింది. ఇందులో జూబ్లీహిల్స్ టికెట్ అజారుద్దీన్ కి కేటాయించడంతో మాజీ మంత్రి పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తనకు ఇతర పార్టీల నుంచి ఆఫర్ వచ్చినా పార్టీని నమ్ముకొని వస్తున్న తనకు ఇంత మోసం చేస్తారా అంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు. ఈ క్రమంలో తన అనుచరులతో కలిసి తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. మరోవైపు విష్ణు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈసారి తెలంగాణలో అధికార పార్టీని ఓడించి తాము అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ ఆకర్ష్ అంటూ పలువురు సీనియర్ నేతలను ఆహ్వానిస్తుంది. ఎప్పుడైతే రెండు అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలు ప్రకటించారో.. అప్పటి నుంచి కాంగ్రెస్ కి వరుస షాకులు తగులుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అసమ్మతి సెగలు వినిపిస్తున్నాయి. టికెట్ల విషయంలో పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆదిష్టానంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల అసంతృప్తిలో ఉన్న నేతలకు బీఆర్ఎస్ ఆహ్వానం పలకడంతో జిల్లాలో పలు నియోజకవర్గాల్లో తప్పకుండా ప్రభావం చూపుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ లో చేరిన నేతలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న నేతల గెలుపు కోసం కృషి చేయడం ఖాయం అంటున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ కి చెక్ పెడదాం అనుకుంటున్న కాంగ్రెస్ ఇప్పుడు ఆ పార్టీకి మేలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి