iDreamPost

జగన్ ఏడాది పాలనపై నేటి నుంచి మేథోమధనం : “మన పాలన- మీ సూచన” సరికొత్త ఆవిష్కరణ

జగన్ ఏడాది పాలనపై నేటి నుంచి మేథోమధనం : “మన పాలన- మీ సూచన” సరికొత్త ఆవిష్కరణ

రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తున్న నేపథ్యంలో తన పాలనపై ప్రజాభిప్రాయాల(ఫీడ్ బ్యాక్)ను తీసుకునేందుకు మేధోమథనం చర్చల ద్వారా “మన పాలన- మీ సూచన” సరికొత్త అవిష్కరణకు నాంది పలికారు.

రాష్ట్రంలో గత ఏడాది కాలంగా అమలుచేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై జగన్ ప్రభుత్వం నేటి నుంచి ఈనెల 30 వరకు రోజూ రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మేథోమధన సదస్సులు నిర్వహిస్తోంది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల 30 నాటికి ఏడాది పూర్తవుతుంది. తొలిత నేడు ‘’పరిపాలన–సంక్షేమం’’పై సిఎం అధ్యక్షతన మొదటి సదస్సు జరగనుంది. జిల్లా స్థాయిలో పథకాల లబ్ధిదారులు, ఆయా రంగాల నిపుణులతో సిఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడతారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన వాటిపై వారి నుంచి సలహాలు, సూచనలను తీసుకుంటారు.

“పరిపాలన–సంక్షేమం”లో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలా అమలయ్యాయి? ప్రస్తుత వైసిపి ప్రభుత్వ ఏడాది పాలనలో ఎలా ఉందో తెలుసుకోవల్సిన అవసరం ఉంది. చంద్రబాబు ఐదేళ్ల పాలన..జగన్ ఏడాది పాలనతో సరితూగదు. ఎందుకంటే జగన్ మేనిఫెస్టోలో పొందుపరిచిన వాటిలో, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో 90 శాతం వరకు ఏడాదిలోనే పూర్తి చేశారు. అదే చంద్రబాబు ఎన్నికల్లో గెలిచిన తరువాత మేనిఫెస్టోని గాలికొదిలేశాడు. ఇచ్చిన హామీల్లో కనీసం కూడా ఐదేళ్లలో పూర్తి చేయలేదు.

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సంక్షేమం గాలికి

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సంక్షేమం గాలికొదిలేసి..తన అనుయాయుల లాభాల కోసం పనిచేశాడు. టిడిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు జన్మభూమి కమిటీల కంబంధ హస్తాల్లో నలిగిపోయారు. రేషన్‌ కార్డు, పెన్షన్.. ఇలా ఏ సంక్షేమ పథకం కావాలన్నా ఆ కమిటీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వచ్చేది. 

ఈ కమిటీల సిఫార్సులతో పాటు సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రులు ఆఖరికి ముఖ్యమంత్రి ఆమోదిస్తేగానీ అవి మంజూరయ్యేవి కావు. సచివాలయానికి వచ్చినా అవి మంజూరు కావడం ఎండమావిగానే ఉండేది. టిడిపి సానుభూతిపరులకే అన్నీ అందేవి. మిగిలిన వారి దరఖాస్తులను నిర్దాక్షిణ్యంగా బుట్టదాఖలు చేసేవారు.

జగన్ ఇంటివద్దకే పరిపాలన తెచ్చాడు

తెలుగుదేశం హయాం నాటి దుర్భర పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఏడాది కిందట అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన వైఎస్‌ జగన్‌ కొద్ది రోజుల్లోనే పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది అక్టోబర్‌ 2న గాంధీ జయంతి నాటి నుంచి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రమంతా ఆవిష్కరించారు. పాదయాత్రలో ప్రజలకిచ్చిన మాట మేరకు.. ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల ద్వారా పరిపాలన వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి దగ్గరకే ప్రభుత్వ పాలనను తీసుకువెళ్లారు.

సంక్షేమ పాలనకు జగన్ ఆవిష్కరణ

రాష్ట్రంలో సిఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనను ఆవిష్కరించారు. ప్రజల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని బలంగా నమ్మిన వైఎస్ జగన్ ప్రజా పాలనను అందించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే పరమావధిగా ఏడాది పాలన చేశారు. ఏ వర్గం…ఏ ప్రాంతం పట్ల వివక్షకు తావు లేకుండా అన్ని వర్గాలకు…అన్ని ప్రాంతాలకు సమన్యాయ పాలన అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,003 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిలో 1.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలను కల్పించి యువత కళ్లల్లో ఆనందాన్ని చూశాడు. అలాగే, మరో 2.70 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లను నియమించి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాడు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్ల బాధ్యతలు ఒక గ్రామ వలంటీర్‌కు.. పట్టణాల్లో ప్రతీ 100 ఇళ్ల బాధ్యతలు ఓ వార్డు వలంటీర్‌కు అప్పగించారు. దీంతో సంక్షేమ పథకాలు ప్రజల ఇళ్ల వద్దకే చేరాయి. దీంతో ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లాడు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 534 సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రజలకు అవసరమై రేషన్ కార్డు, పింఛను, ఆరోగ్య శ్రీ కార్డు కోసం కాళ్లు అరిగేలా తిరగక్కర్లేదు..

ఎవరికైనా రేషన్‌ కార్డు, పింఛను, సర్టిఫికెట్టు, ఆరోగ్యశ్రీ కార్డు ఇలా ఏదైనా సర్వీసు కావాలంటే వలంటీర్‌కు చెప్పి దరఖాస్తు చేస్తే చాలు. ఇక ఎవ్వరి దగ్గరకు ప్రజలు వెళ్లక్కర్లేదు. సచివాలయం, మండల కార్యాలయాలు, ప్రజా ప్రతినిధులు చుట్టూ కూడా తిరగాల్సిన పనేలేదు. సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల సిఫార్సుల అవసరమే లేదు. అర్హులైన వారందరికీ ఇంటి దగ్గరకే ప్రభుత్వ ఫలాలు వచ్చి చేరుతున్నాయి. గ్రామ సచివాలయంలో లబ్ధిదారుల అర్హతలను ఈ వలంటీర్లు పరిశీలించి ఆన్‌లైన్‌లో సంబంధిత సెంట్రల్‌ సర్వర్‌కు వారి దరఖాస్తులను పంపుతున్నారు. సంబంధిత శాఖ మరోసారి అర్హతపై ఆన్‌లైన్‌లోనే తనిఖీలు నిర్వహిస్తోంది. అర్హత ఉందా లేదా అనే సిఫార్సుతో 72 గంటల్లో గ్రామ సచివాలయానికి తిరిగి దరఖాస్తు వస్తుంది. అంతే.. గ్రామ సచివాలయంలో అర్హత ఉన్న వారికి వెంటనే సంబంధిత కార్డు ప్రింట్‌ చేసి వలంటీర్‌ ద్వారా ప్రజల ఇళ్లకు అందజేస్తారు. అర్హత లేదని తేలితే మరోసారి మూడో పార్టీ ద్వారా తనిఖీ చేస్తారు. అనంతరం దరఖాస్తుదారునికి తెలియబరుస్తారు. ఇందుకనుగుణంగా అధికార యంత్రాంగం ఆన్‌లైన్‌ వ్యవస్థను రూపకల్పన చేసింది. అంతేకాదు.. అధికార వికేంద్రీకరణను చేపట్టడంతో పాటు పాలనలో జవాబుదారీ, పారదర్శకతను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఈ పథకాల మంజూరు అధికారాన్ని తహసీల్దారుకు అప్పగించారు. 

తహసీల్దారు 12 గంటల్లోగా మంజూరు చేయడమో లేదా తిరస్కరించడమో చేయాలి. అలా చేయకపోతే ఆటోమేటిక్‌గా మంజూరు అయ్యేలా ఆన్‌లైన్‌ వ్యవస్థను రూపకల్పన చేశారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. లబ్ధిదారుల గుర్తింపునకు ఇంటింటి సర్వే నిర్వహించారు.

సంక్షేమ పథకాల పంట

వైఎస్సార్‌ నవశకం పేరుతో నవరత్నాల్లోని పథకాలన్నింటికీ సంతృప్తి (శాచురేషన్‌) స్థాయిలో అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించింది. ఆయా పథకాల పరిధిలోకి మరింత ఎక్కువమంది లబ్ధిదారులు వచ్చేందుకు వీలుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అర్హత నిబంధనలు సడలిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అర్హులను  వలంటీర్ల ద్వారా గుర్తించి.. ఫలాలను వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఇప్పించారు. వార్షిక ఆదాయం ఐదు లక్షలలోపు ఉన్న వారందరికీ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేశారు. దీంతో రాష్ట్రంలోని 95 శాతానికి పైగా జనాభాకు ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరుచేసి ఆరోగ్య భరోసా కల్పించారు. నవరత్నాల్లోని ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడానికి రాజకీయాలు, పార్టీలు, మతాలు, కులాలు, ప్రాంతాలు చూడబోమని, అర్హత ఉంటే చాలు.. వారికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని, పైసా లంచం ఇవ్వకుండానే ప్రయోజనాలను నేరుగా ఇంటికి పంపిస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ రాష్ట్రంలో అక్షరాలా నిజమవుతోంది. వైఎస్ జగన్ ఏడాది పాలనలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల పంట పండించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి