iDreamPost

బెనిఫిట్ షోలు బంద్ – అభిమానులకు షాక్

బెనిఫిట్ షోలు బంద్ – అభిమానులకు షాక్

ఇటీవలే 16 ఏళ్ళ తర్వాత రీ రిలీజైన పోకిరి కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంత హంగామా చేశారో చూశాంగా. ఏకంగా 1 కోటి 70 లక్షల దాకా వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చిందని గర్వంగా చెప్పుకున్నారు. ఎప్పుడో 1994లో దానవీరశూరకర్ణ తర్వాత ఒక పాత సినిమా ఈ స్థాయిలో వసూలు చేయడం పోకిరి వల్లే సాధ్యమయ్యింది. అయితే కొన్ని చోట్ల అభిమానులు అత్యుత్సాహంతో చేసిన పనుల వల్ల థియేటర్లకు డ్యామేజ్ జరిగింది. స్క్రీన్లు చినిగిపోయేలా కొందరు చేసిన అతి అల్లరి ఆయా యాజమాన్యాలకు చాలా నష్టం చేకూర్చింది. ఈ నేపథ్యంలో ఇకపై తమ జిల్లాలో బెనిఫిట్ షోలు ప్రీమియర్లు ఉండవని కాకినాడ ఎగ్జిబిటర్లు మూకుమ్మడిగా నిర్ణయం తీసుకోవడం షాక్ కలిగిస్తోంది.

ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఘరానా మొగుడు, సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా జల్సాని రీ రిలీజ్ చేసేందుకు మెగా ఫ్యాన్స్ ఆల్రెడీ ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పుడీ న్యూస్ వాళ్లకు శరాఘాతమే. ప్రస్తుతానికి ఒక జిల్లాకే పరిమితమైనప్పటికీ మిగిలిన వాళ్ళు ఫాలో కాకుండా పోయే ఛాన్స్ తక్కువే. అదే జరిగితే వెండితెరపై మరోసారి క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ ఎంజాయ్ చేయాలనుకున్న ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ తప్పదు. అయినా నియంత్రణలో ఉండాల్సిన అభిమానులు అదుపు తప్పితే పరిణామాలు ఇలాగే ఉంటాయి. థియేటర్ ప్రాపర్టీలకు ఇలాంటి పనుల వల్ల కలిగే నష్టాన్ని ఎవరు పూడ్చాలంటే దానికి సమాధానం దొరకడం కష్టం.

ఇది కొత్త రిలీజులకు కూడా అప్లై చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. రాబోయే రోజుల్లో శివ, వర్షం, దేశముదురు, సింహాద్రి లాంటి వాటిని మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడీ డెసిషన్ కనక స్ట్రిక్ గా తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇలాంటి క్లాసిక్ రీ రిలీజులను చూసే అవకాశాలు సన్నగిల్లొచ్చు. అసలే జనం థియేటర్లకు రావడం లేదని కకావికలం అయిపోతున్న తరుణంలో వీలైనంతగా వాటిని కాపాడుకోవాలే తప్ప ఇలాంటి పనులు చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కొత్త చిత్రాలకు ధీటుగా పాత సినిమాలు ఈ స్థాయిలో పబ్లిక్ ని ఆకట్టుకోవడం చూస్తే మళ్ళీ పాత రోజులు వస్తున్నాయేమో అనిపిస్తుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి