iDreamPost
android-app
ios-app

పీవీ సింధు సంచలనం, రిటైర్మెంంట్ ప్రకటనతో కలకలం

  • Published Nov 02, 2020 | 11:56 AM Updated Updated Nov 02, 2020 | 11:56 AM
పీవీ సింధు సంచలనం, రిటైర్మెంంట్ ప్రకటనతో కలకలం

ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సంచలన ప్రకటన చేసింది. పూసర్ల వెంకట సింధు‌ చేసిన ఇన్ స్టా పోస్ట్ ఒకటి కలకలం రేపింది. తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించింది. అందుకు కారణాలను కూడా ఓ సుదీర్ఘ పోస్ట్ తో వివరణ కూడా ఇచ్చింది. ‘నేను రిటైర్‌ అయ్యాను. డెన్మార్క్‌ ఓపెన్‌ నా చివరి ఆట’ అని పేర్కొన్న సింధు పోస్ట్ విశేషంగా చర్చనీయాంశం అయ్యింది.

ఆమె ప్రకటనలో ‘కరోనా మహమ్మారి నాకు కనువిప్పుగా మారింది. నా ప్రత్యర్థితో పోరాడటానికి కఠోరమైన శిక్షణ తీసుకునేదాన్ని. చివరి వరకు పోరాడేదాన్ని. ఇంతకు ముందు చేశాను, ఇకపై కూడా చేయగలను. కానీ, కంటికి కనిపించని వైరస్‌ను ఎలా ఓడించగలను. నెలలు గడుస్తున్నాయి. బయటకు వెళ్లాలనుకునే ప్రతీసారి ఆలోచిస్తున్నాము. విశ్రాంతి లేని ఆటకు స్వప్తి పలకాలని నిశ్చయించుకున్నాను. నెగిటివిటీ, భయం, అనిశ్చితి నుంచి రిటైర్‌ అవ్వబోతున్నాను. ప్రతీరోజు సోషల్‌ మీడియాలో చదువుతున్న కథనాలను నన్ను నేను ప్రశ్నించుకునేలా చేశాయి. మనం మరింత సంసిద్ధంగా ఉండాలి. కలిసికట్టుగా వైరస్‌ను ఓడించాలి. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయం మన, మన భావితరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వారిని ఓడిపోనివ్వకుండా చూడాలి’ అంటూ పేర్కొంది.

వాస్తవానికి పీవీ సింధు ఇటీవల ప్రాక్టీస్ పేరుతో ఇంగ్లాడ్ వెళ్లడమే ఆశ్చర్యంగా మారింది. కోచ్ పుల్లెల గోపీచంద్ తీరు పట్ల సింధు తల్లిదండ్రులు ఆరోపణలు కూడా చేశారు. అయితే తల్లిదండ్రుల అనుమతితోనే ఆమె ఇంగ్లాడ్ వెళ్లినట్టు ఆ తర్వాత వివరణ కూడా ఇచ్చింది. దానికి సంబంధించిన చర్చ చల్లారకముందే తాజాగా ఈ సంచలన పోస్ట్ ద్వారా మరోసారి అభిమానులకు షాకిచ్చింది. ‘‘డెన్మార్క్‌ ఓపెన్‌ జరగలేదు. కానీ, నేను ప్రాక్టీస్‌ చేయటం మానలేదు. ఏషియా ఓపెన్‌కు ప్రిపేర్‌ అవుతున్నాను. దేన్ని కూడా సులభంగా వదిలి పెట్టడం నాకు ఇష్టం లేదు. ప్రపంచం మొత్తం మీద పరిస్థితులు చక్కబడేవరకు పోరాడుతూనే ఉంటాను’’ అంటూ ఆమె వ్యాఖ్యానించింది.

అయితే సింధు పోస్ట్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిటైర్మెంట్ పై వ్యంగ్య పోస్టులు చేయడం తగదని అభిమానులు కూడా మండిపడుతున్నారు. ఆమె తీరు సరికాదని సూచిస్తున్నారు. బ్యాడ్మింటన్ లో సంచలన విజయాలకు పెట్టింది పేరుగా మారిన పీవీ సింధు ప్రవర్తన మార్చుకోవాలని అంటున్నారు.