కాంగ్రెస్ నేత, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి ఫి.చిదంబరానికి ఊరట లభించింది. 106 రోజుల జైలు జీవితానికి ఎట్టకేలకు తెరపడింది. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కుంభకోణం, మనీ ల్యాండరింగ్ కేసుల్లో పి.చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీం ఉత్తర్వులు అందిన తర్వాత తీహార్ జైలు గేట్ నంబర్ 3 నుంచి నిన్నబుధవారం రాత్రి 8.10 గంటలకు చిదంబరం బయటకి వచ్చారు. కుమారుడు కార్తితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు జైలు వెలుపల చిదంబరానికి ఘనంగా స్వాగతం పలికారు. జైలు బయట చిదంబరం స్పందన కోసం వేచి చూస్తున్న మీడియా ప్రతినిధులు ఆయనను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు.
తారు మారు చేయలేరు..
‘‘106 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది‘ అని చిదంబరం అన్నారు. ఇన్ని రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించినా తనపై ఒక్క అభియోగం కూడా నమోదు కాలేదని చెప్పారు. అంతకుముందు సుప్రీంకోర్టు చిదంబరానికి బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యాలు తారుమారు చేస్తారన్న ఈడీ వాదనల్ని తోసిపుచ్చింది. ‘చిదంబరం ఇప్పుడు ప్రభుత్వ ప్రతినిధి కాదు, ఆయనకు రాజకీయ అధికారాలు లేవు. సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశమే లేదు’ అని జస్టిస్ ఆర్.భానుమతి ధర్మాసనం పేర్కొంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ఆగస్టు 21న చిదంబరాన్నికస్టడీలోకి తీసుకుంది. ఆ తర్వాత తీహార్జైల్లోనే ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టింది.
ఇవి ఆంక్షలు..
బెయిల్పై విడుదలయ్యాక ఈ కేసుకు సంబంధించి చిదంబరం మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. ఈడీ ఎప్పుడు అడిగినా చిదంబరం అందుబాటులో ఉండి విచారణకు సహకరించాలని, ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని ఆదేశాలిచ్చింది.