Idream media
Idream media
వరద సాయం చేయకుండా కేంద్ర మంత్రులు ఇప్పుడు వరదలా వస్తున్నారు. ఇవి స్థానిక ఎన్నికలా? జాతీయస్థాయి ఎన్నికలా? బక్క కేసీఆర్ను కొట్టడానికి ఇంత మందా?” అంటూ ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో అసలు బీజేపీ నుంచి ఎంత మంది గ్రేటర్ ఎన్నికలకు వచ్చారో పరిశీలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. నిజంగా మున్సిపల్ ఎన్నికల కోసం ఇంత మంది రంగంలోకి దిగడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. బహుశా ఇది కేవలం మున్సిపల్ ఎన్నికల లక్ష్యంలా కనిపించడం లేదు. బీజేపీ బలాన్ని చూపి టీఆర్ఎస్ లోని అసంతృప్తులను ఆకట్టుకునే వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే పార్టీ అతిరథ మహారథులందరినీ రప్పించింది. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాల్లో విజయం కమలనాథులకు ఊపిరి పోయగా, తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక విజయం మరింత జోష్ను నింపింది. ఈసారి ఎలాగైనా బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది.
ప్రచారంలో పాల్గొన్నప్రముఖులెవరెవరంటే..
పార్టీ ఎన్నికల ఇన్చార్జి, జాతీయ నేత భూపేందర్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ లోనే తిష్ట వేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ మంత్రి డీకే ఆరుణ తదితర కీలక నేతలు అభ్యర్థుల గెలుపును తమ భుజస్కందాలపై వేసుకొని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ప్రకాశ్జవదేకర్, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు సూర్యతేజ తదితరులు హైదరాబాద్లో ప్రచారం నిర్వహించారు. మరో కేంద్ర మంత్రి నిత్యానంద్రాయ్జీ రెండు రోజులు ప్రచారం చేపట్టారు. కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఎన్నికల ప్రచారం కోసం శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. సాయంత్రం కొత్తపేట చౌరస్తా నుంచి నాగోల్ వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం నగర విద్యావంతులతో సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. పాతబస్తీలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రోడ్ షోలు నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా కూడా ఆదివారం గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వీరితో పాటు రాజ్యసభ మాజీ సభ్యులు గరికపాటి రామ్మోహనరావు, సినీ నటుడు బాబూమోహన్ వంటి వారు కూడా కొన్ని ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.