iDreamPost

విషాదం.. 4న పెళ్లి.. మొన్న రిసెప్షన్, నిన్న వరుడి ఆత్మహత్య

విషాదం.. 4న పెళ్లి.. మొన్న రిసెప్షన్, నిన్న వరుడి ఆత్మహత్య

పెళ్లింట విషాదం నెలకొంది. మూడు ముళ్లు వేసి మూడ్రోజులైనా అవ్వకుండా.. వరుడు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. వరుడి మృతితో.. రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఖమ్మం జిల్లాలోని వైరా మండలం పుణ్యవరం గ్రామానికి చెందిన కమ్మంపాటి నరేష్ (29)కు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా (ఉమ్మడి కృష్ణాజిల్లా)కు ఆర్లపాడు గ్రామానికి చెందిన యువతితో జూన్ 4న పెళ్లైంది.

జూన్ 5 ఆదివారం వరుడి స్వగ్రామంలో రిసెప్షన్ నిర్వహించారు. వధూవరులిద్దరూ ఆనందంగానే ఉన్నారు. నరేష్ తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ కూడా వేశాడు. నిన్న (జూన్ 6) కుటుంబ సభ్యులంతా కలిసి విజయవాడ సమీపంలోని గుణదల దైవదర్శనానికి వెళ్లాలనుకున్నారు. నరేష్ తెల్లవారుజామున 3 గంటలకే లేచి.. అందరినీ నిద్రలేపి ప్రయాణానికి సిద్ధం చేశాడు. ఆపై స్నానం చేసి వస్తానని గదిలోకి వెళ్లి ఎంతసేపటికి బయటికి రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు అతనికి మొబైల్ కు కాల్ చేశారు.

ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో.. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. నరేష్ రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తీీసుకెళ్లగా.. బ్లేడుతో చెయ్యి, గొంతు కోసుకోవడంతో అప్పటికే అతను మరణించినట్లు నిర్ధారించారు. పెళ్లిరోజు, రిసెప్షన్ రోజున సంతోషంగానే కనిపించిన నరేష్.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. నరేష్ మృతితో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి