iDreamPost

పవన్ 27లో కీలక మార్పులు

పవన్ 27లో కీలక మార్పులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ ఇచ్చాక చేస్తున్న సినిమాల తాలూకు అప్ డేట్స్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకేసారి మూడు ప్రకటించడంతో రెండేళ్లలో తమ హీరోని అన్నిసార్లు చూసుకోవచ్చన్న ఉత్సాహం వాళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పింక్ రీమేక్ ఎలాగూ చిన్న బడ్జెట్ అందులోనూ చూసిన కథే కాబట్టి దాని మీద భారీ అంచనాలు లేవు కానీ ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా మీదే హైప్ ఎక్కువగా ఉంది.

తెలంగాణా పోరాట యోధుడు పండగ సాయన్న కథతో ఇది తీస్తున్నారని మీడియా కోడై కూస్తున్నప్పటికీ యూనిట్ మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉంది. ఇదిలా ఉండగా దీనికి సంబంధించిన టైటిల్ గురించి ఇప్పుడు ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. దాని ప్రకారం పవన్ 27కి విరూపాక్ష అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్టు తెలిసింది. ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేశారట. కానీ ఇది ఖరారు చేసేందుకు క్రిష్ అందుబాటులో లేడు కాబట్టి ఇప్పటికైతే అధికారికంగా ధృవీకరించలేం.

ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం ఇందులో హీరోయిన్లుగా జాక్వలిన్ ఫెర్నాండెజ్, దిశా పటాని హీరోయిన్లు ఎంపికయ్యారని కాస్త గట్టిగానే వినిపించింది. కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళలో ఒకరి స్థానంలో నిధి అగర్వాల్ వచ్చే ఛాన్స్ ఉందట. ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్ అయినా ఆ తర్వాత ఈ అమ్మడికి సరైన బ్రేక్ రాలేదు. క్రేజీ ఆఫర్స్ తలుపు తట్టలేదు. ఈ నేపథ్యంలో పవన్ పక్కన ఛాన్స్ అంటే చిన్న విషయం కాదు. కాకపోతే నిర్మాతలు నిజంగా తనను సంప్రదించారా లేక పేరు పరిశీలనలో ఉందా అనేది ఇంకా తెలియలేదు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే హరీష్ శంకర్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుంది. అది ఈ ఏడాది జరిగే అవకాశం లేనట్టే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి