iDreamPost

ఏలూరును జల్లెడపడుతున్న యంత్రాంగం

ఏలూరును జల్లెడపడుతున్న యంత్రాంగం

పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో ప్రజలు అస్వస్థతకు గురవుతున్న కారణాలను కనుగునేందుకు ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. బాధితుల రక్తంలో లెడ్‌ హెవీ మెటల్‌ (సీసం), నికెల్‌ నమూనాలు ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్‌కు ప్రాథమికంగా గుర్తించడంతో.. వైద్యులు, అధికారులు ఆ దిశగా తమ పరిశోధనను ప్రారంభించారు. ఆహారం, పాలు, నీళ్ల ద్వారా బాధితుల దేహాల్లోకి సీసం, నికెల్‌ మూలకాలు వెళ్లే అవకాశం ఉందని ఎయిమ్స్‌ పేర్కొనడంతో.. ఉప ముఖ్యమంత్రి హోదాలో వైద్యశాఖను పర్యవేక్షిస్తున్న ఆళ్లనాని క్షేత్రస్థాయికి వెళుతున్నారు.

వైద్యులు, నిపుణులు, ఇతర అధికారులతో కలసి నగరంలోని నీళ్ల ట్యాంకులను ఆళ్ల నాని పరిశీలిస్తున్నారు. నగరంలోని నీళ్ల ట్యాంకుల్లో నీటి శాంపిళ్లను అధికారులు సేకరిస్తున్నారు. మున్సిపల్‌ నీళ్లలో సీసం, నికెల్‌ మూలకాలు ఏమైనా కలిసి ఉంటాయన్న కోణంలో పరిశోధిస్తున్నారు. తాజా సమాచారంతో పాలు కొనుగోలు చేసేందుకు ఏలూరు ప్రజలు వెనకంజవేస్తున్నారు.

ఎయిమ్స్‌ ప్రాథమిక నివేదికలో సీసం, నికెల్‌ వంటి భార లోహాలు మోతాదుకు మించి ఉన్నప్పుటికీ పూర్తిస్థాయిలో నిర్థారించాల్సి ఉందని ఆళ్ల నాని పేర్కొన్నారు. సీసీఎంబీ, ఇతర జాతీయ పరిశోధన సంస్థల నుంచి నివేదికలు వచ్చిన తర్వాతనే ఏలూరులో తలెత్తిన పరిస్థితికి కారణాలు తెలుస్తాయని చెప్పారు.

మరోవైపు వింత వ్యాధి సోకిన వారు రోజు వ్యవధిలోనే కోలుకోవడం ప్రభుత్వంతోపాటు స్థానికులకు ఉపసమనం కలిగిస్తోంది. ఇప్పటి వరకు 505 మంది ఈ వింత వ్యాధికి గురికాగా.. ఇప్పటి వరకు 385 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. మనో 120 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 19 మందిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు, విజయవాడలకు తరలించారు. లక్షణాలు కనిపించిన వెంటనే బాధితులు ఆస్పత్రికి వస్తున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆస్ప్రత్రిలో ప్రత్యేకంగా వార్డులు సిద్ధం చేశారు. వైద్యులు 24 గంటల పాటు బాధితులను పర్యవేక్షిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి