iDreamPost

ఒకే ఏడాదిలో రెండో గాయం

ఒకే ఏడాదిలో రెండో గాయం

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి కేవలం తొమ్మిది నెలల వ్యవథిలో రెండో గాయం కావడం అభిమానులను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. ఆయన సతీమణి, మహేష్ బాబు తల్లిగారు ఇందిరా దేవి అనారోగ్యంతో ఇవాళ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలకు శోకాన్ని కలిగించింది. ఆవిడ వయసు డెబ్భై సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ ఇవాళ స్వగృహంలోనే తుది శ్వాస తీసుకున్నారు . ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే కన్నుమూశారని సమాచారం. శోకతప్త హృదయాలతో హైదరాబాద్ లో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇందిరాగారి మీద అశేషమైన ప్రేమ ఉన్న మహేష్ ని ఇలా విషణ్ణవదనంతో చూడలేక ఫ్యాన్స్ తల్లడిల్లుతున్నారు.

ఇదే ఏడాది జనవరి 8న మహేష్ అన్నయ్య రమేష్ బాబు ఇలాంటి కారణంతోనే స్వర్గానికేగడం జనం ఇంకా మర్చిపోలేదు. ఆ గాయం పచ్చిగా ఉండగానే ఇప్పుడీ విషాదం చోటు చేసుకుంది. కృష్ణ ఇందిరా దంపతులకు అయిదుగురు సంతానం. కృష్ణ నట వారసత్వాన్ని రమేష్ కొంతమేరకు నిలబెట్టగా ఆ తర్వాత నిర్మాతగ అర్జున్ లాంటి సినిమాలు తీశారు. మహేష్ బాబు నాన్నకు తగ్గట్టు ఆయన స్టార్ డంని క్యారీ చేస్తూ పెద్ద స్థాయికి చేరుకున్నాడు. పలు ఇంటర్వ్యూలలో చెప్పినట్టు మహేష్ కు అమ్మ చేతి కాఫీ అంటే చాలా ఇష్టం. కొత్త సినిమా రిలీజప్పుడు విపరీతమైన టెన్షన్ కలిగితే నేరుగా ఆవిడ దగ్గరకు వెళ్లి కాఫీ తాగి రిలాక్స్ అవ్వడం తనకు సెంటిమెంట్

ఇటీవలే కృష్ణంరాజు గారు కన్నుమూత తర్వాత ఇంకా ఆ చేదు జ్ఞాపకం మరిచిపోకముందే ఇలా జరగడం బాధాకరం. ఇందిరా దేవి గారు ఎప్పుడూ సినిమా విషయాల్లో ప్రమేయం చూపించేవారు కాదు. సినిమాలు చూస్తూ అప్పుడప్పుడు షూటింగ్ స్పాట్ కు వచ్చి పిల్లలను పలకరించడం తప్ప ఎన్నడూ వాటి గురించి సీరియస్ గా పట్టించుకునే వారు కాదు. పోకిరి నిర్మించిన సమయంలో కుమార్తె మంజుల ఆవిడ పేరు మీదే బ్యానర్ పేరుని భాగస్వామిగా జత చేశారు. కృష్ణగారి రెండో భార్య విజయనిర్మల గారు కాలం చేశాక ఇప్పుడు ఇందిరగారు సైతం వెళ్లిపోవడం చూస్తే ఈ వయసులో ఆయనకు కలిగిన ఈ తీవ్రమైన క్షోభను ఓదార్చడం ఎవరి వల్లా జరగని పని.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి