iDreamPost

అసలు ఆట ఇప్పుడే మొదలయ్యింది.. ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో చూస్తాం: KTR

  • Published Dec 13, 2023 | 2:41 PMUpdated Dec 13, 2023 | 2:41 PM

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Dec 13, 2023 | 2:41 PMUpdated Dec 13, 2023 | 2:41 PM
అసలు ఆట ఇప్పుడే మొదలయ్యింది.. ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో చూస్తాం: KTR

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురయ్యింది. డిసెంబర్ 7న కాంగ్రెస్ కొత్త గవర్నమెంట్ కొలువుదీరింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆరు గ్యారెంటీల అమలుపైనే కాంగ్రెస్ దృష్టి పెట్టింది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పుకొస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం దూకుడుగా వెళ్తుంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ.. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టిందంటూ విమర్శలు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదని చెప్పారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఏటా పీఏసీ, కాగ్ రిపోర్ట్స్ ఇచ్చామని చెప్పుకొచ్చారు. ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నామని తెలిపారు. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా.. హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు కేటీఆర్. అంతేకాక తాము అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశామని గుర్తు చేశారు.

రేపు (డిసెంబర్ 14) గవర్నర్ ప్రసంగంలో కూడా కాంగ్రెస్ నేతలు ఇదే పాత చింతకాయ పచ్చడి చెబుతారని.. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని అంటారని ఎద్దేవా చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నాడని.. అది ఎలా సాధ్యం అవుతుందని.. దాని కంటూ ఓ పద్దతి, ప్రణాళిక లేవని విమర్శించారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయని.. ఇప్పుడు అసలు ఆట మెుదలవుతుంది.. ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో చూస్తాం అన్నారు కేటీఆర్. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలన్నారు. రెండు లక్షల రుణమాఫీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాంధీ హామీ ఏమైందని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నించారు. అంతేకాక కేబినెట్ మొదటి సమావేశంలోనే.. ఆరు గ్యారంటీలకు చట్టబద్దత తెస్తమన్న హామీ ఎక్కడ అని ఆయన నిలదీశారు.

స్పీకర్ ఎన్నిక.. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మద్దతు..

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించించింది. స్పీకర్ నామినేషన్ పత్రంపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, సీతక్క సంతకాలు చేశారు. బీఆర్ఎస్ తరుపున మద్దతు తెలుపుతూ కేటీఆర్ సంతకం చేశారు. ఎంఐఎం కూడా మద్దతు తెలపటంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి