iDreamPost

ఎన్నికల కమిషన్ విధులేంటి? చేస్తున్న పనులేంటి?

ఎన్నికల కమిషన్ విధులేంటి? చేస్తున్న పనులేంటి?

ఎలెక్షన్ కమిషన్ ఒక తాత్కాలిక ఏర్పాటు.ఎన్నికల సందర్బంగా మాత్రమే , ఎన్నికల నిర్వహణ కోసమే క్రియాశీలకంగా పని చేసే వ్యవస్థ . అంతేకాని అది నిత్యచైతన్య వ్యవస్థ కాదు . అందుకోసమే ఎన్నికల కమిషన్ కి శాశ్వత ఉద్యోగులు లేరు . ఎన్నికల కమీషన్ హక్కులు,విధుల మీద నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి.

కరోనా ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఏకపక్షంగా,ప్రభుత్వానికి సమాచారం లేకుండా మీడియా సమావేశంలో వెల్లడి చెయ్యటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

కరోనా ప్రభావం ఉందని 10 రోజుల ముందే స్కూల్స్ మూసివేస్తూ కొన్న పాఠశాలలు నిర్ణయం తీసుకున్నాయి.ఇది ముందస్తు చర్యలలో భాగంగా విద్యార్థుల తల్లితండ్రుల విజ్ఞాపనలతో తీసుకున్న నిర్ణయమే కానీ ప్రభుత్వ ఆదేశాలతో తీసుకున్న నిర్ణయం కాదు.

కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో వివరించే నివేదిక ఏది కేంద్ర,రాష్ట్ర ఆరోగ్య శాఖలు విడుదలచేయలేదు. ప్రస్తుతానికి భారత దేశంలో కరోనా ఉందని మాత్రం అధికారికంగా ప్రకటించారు. రాబోయే రెండు మూడు నెలలో కరోనా విజృంభించే అవకాశం ఉందన్న అనుమానంతో ముందస్తు జాగర్తలు తీసుకుంటున్నారు.

ప్రజా ఆరోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యత కానీ ఎన్నికల సంఘం విధి కాదు. కరోనా వలన ఎన్నికలు జరపాలా లేదా అన్న నిర్ణయం తీసుకోవలసింది ప్రభుత్వమే కానీ ఎన్నికల సంఘం కాదు . స్థానిక భద్రత సమస్య ,సరిపడా ఈవీఎంలు , మరియు సిబ్బంది తదితర కారణాలతో ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ మీద ఒక నిర్ణయం తీసుకోవచ్చు కానీ కరోనా పేరుతొ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం ప్రభుత్వ విధులలో జోక్యం చేసుకోవటమే.

ప్రజారోగ్యం కోసం ఎన్నికలు వాయిదా వేస్తున్నామని ఈసీ ఉదహరించే పక్షంలో వారు చేయవలసిన అతి ముఖ్యమైన పని ఆరోగ్యశాఖ కార్యదర్శిని , రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని సంప్రదించి రిపోర్ట్స్ తీసుకోవాలి . ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించగలరో లేదో అభిప్రాయం తీసుకోవాలి .

ఆ పని చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడానికి వారి వద్ద ఉన్న ఆరోగ్య శాఖ సమాచారం ఏంటీ ?.

కరోనా ప్రభావం మీద ఎవరి వద్ద నుంచి నివేదిక తీసుకొన్నారు ?.ప్రభుత్వంతో ఎన్నికలు వాయిదా వేసే ముందు ప్రభుత్వంతో సంప్రదించారా?ఎన్నికలు వాయిదా వేస్తున్న విషయం కనీసం ఎన్నికల కార్యదర్శికి అయినా తెలుసా? . తమ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేయకుండా డైరెక్ట్ గా మీడియాకి తెలియజేయవలసిన అవసరం ఏంటీ ?ఇది వ్యవస్థ నిర్ణయమా ? వ్యక్తి నిర్ణయమా ?.

ప్రస్తుత పరిస్థితులు ఏంటీ ? ప్రభావం ఏ మేరకు ఉంటుంది ? ఎన్నికలు నిర్వహణలో కరోనా ప్రభావం పడకుండా మీరు తీసుకొంటున్న చర్యలేంటి ? ఈ పరిస్థితుల్లో మీరు సమగ్ర రక్షణ చర్యలు తీసుకొని ఎన్నికలు నిర్వహించగలరా లేదా ? అన్న వివరణలు ఏమీ తీసుకోకుండా అసలు సంప్రదింపులు లేకుండా తీసుకొన్న ఈ నిర్ణయం పూర్తి ఏకపక్షంగా కొందరు వ్యక్తుల ప్రమేయంతో వారి ఉద్దేశ్యాలకు అనుగుణంగా తీసుకున్నట్టు కనిపిస్తుంది .

ఒకవేళ కరోనా వలనే ఈ నిర్ణయం అనే పక్షంలో కేంద్ర ఆరోగ్య శాఖ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మెడికల్ ఎమెర్జెన్సీ ఏమీ విధించలేదు . ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయలేదు కదా .. వారికి లేని అంచనాలు , వారు చేయని నిర్ణయాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ విధంగా తీసుకొంటుంది .

రాబోయే రెండు నెలల తర్వాత కరోనా ఏ స్థాయిలో ఉంటుందో ఈసీకి అంచనా ఉందా ?. అప్పటి పరిస్థితి గురించి ఈసీ హామీ ఇస్తుందా?.

ఆ రోజు పరిస్థితులకు ఈసీ బాధ్యత వహిస్తుందా ?.

రాబోయే రెండు నెలల్లో అమల్లో ఉండే ఎన్నికల కోడ్ వలన స్థానిక సంస్థల పరిధిలో ఏ కొత్త పని చేపట్టాలన్నా , ఏ నిర్ణయం తీసుకోవాలన్న కోడ్ నిబంధనలు అడ్డు పడుతుంటాయి . తాగునీటి ఎద్దడి కారణంగా , ఆరోగ్య తీసుకోబోయే చర్యలకు ప్రతిదానికీ ఈసీ పెర్మిషన్ కోసం ఎదురు చూడాలి .

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీ జరగనిస్తారా? లేక ఎన్నికల కోడ్ అమలులో ఉందని అడ్డుకుంటారా?

ఎన్నికలు జరగకూడదని టీడీపీ కోరుకోవటం,తమ నాయకునితో రిజర్వేషన్ల మీద కోర్టు కేసు వేయించటం … చివరికి తామే సుప్రీం కోర్టుకు వెళ్ళటం… ఎదో ఒక విధంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యం చేసి 14వ ఆర్థిక సంఘం నుంచి రావల్సిన 5000 కోట్ల నిధులను మురిగిపోయేలా చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్న వారికి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం సంతోషాన్ని ఇస్తుండొచ్చు కానీ ప్రజలు ఈ నిర్ణయాన్ని హర్షించరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి