iDreamPost

Theatres : థియేటర్లు నిండాలంటే వాళ్ళు రావాల్సిందే

Theatres : థియేటర్లు నిండాలంటే వాళ్ళు రావాల్సిందే

థియేటర్లు తెరుచుకుని నెలలు దాటుతున్నా ఇండస్ట్రీ కోరుకున్న కిక్ ఇంకా పూర్తి స్థాయిలో రావడం లేదు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలుగులోనే ఈ అయిదు నెలల కాలంలో అత్యధిక సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఏదీ నలభై కోట్ల షేర్ ని సాధించలేకపోయింది. లవ్ స్టోరీ, ఎస్ఆర్ కళ్యాణ మండపం, రాజరాజచోర లాంటి సక్సెస్ లు ఉన్నప్పటికీ అవి పెట్టుబడుల మీద లాభాలు ఇచ్చినవే తప్ప పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో రాలేదు. వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ప్రధాన కారణం ఫ్యామిలీ ఆడియన్స్ గతంలోలా హాళ్లకు పూర్తిగా రావడం లేదు. కుటుంబం మొత్తాన్ని థియేటర్ కు తీసుకువచ్చేందుకు ఆలోచిస్తున్న శాతం ఎక్కువగా ఉంది.

దీనికి కారణాలు ఉన్నాయి. కరోనా భయాలు ఇంకా పోలేదు. క్రమంగా తగ్గుతోందనుకుంటున్న టైంలో ఇప్పుడు ఓమిక్రాన్ వచ్చి పడింది. ఇప్పటికిప్పుడు దీని వల్ల ఇండియాలో ప్రాణ నష్టం జరగలేదు కానీ మరీ తక్కువ అంచనా వేయడానికి లేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కేసులు ఉన్నాయని అంటున్నారు. అయితే అధికారిక ప్రకటనలు లేవు. సో జనంలో భయాలు ఉండటం సహజం. థియేటర్ కు వెళ్లి సినిమా చూడటం అవసరమా అనుకునే ధోరణి పెరిగిపోతోంది. కేవలం 20 రోజుల గ్యాప్ తో కొత్త సినిమాలన్నీ నేరుగా ఓటిటికి వస్తుండటంతో ఆ హాల్ దాకా వెళ్లి ఏం చూస్తాంలే అనుకునే వాళ్ళు క్రమంగా ఎక్కువవుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు.

రేపు రిలీజ్ కాబోతున్న అఖండ కంప్లీట్ మాస్ ఎంటర్ టైనర్. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. ఫస్ట్ వీక్ అభిమానుల సందడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండో వారం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ టర్న్ అయితే బ్లాక్ బస్టర్ ఖాయం. కానీ ఇంట్లో డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ కు విపరీతంగా అలవాటు పడిపోతున్న ఈ వర్గాన్ని థియేటర్ కు రప్పించడం రానురాను సవాల్ గా మారేలా ఉంది. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి వాటిని మినహాయిస్తే మిగిలినవాటికి ఇది కత్తి మీద సాము లాంటిది. ఈ అనుమానాల వల్లే దృశ్యం 2 లాంటివి జై ఓటిటి అనక తప్పలేదు. మరి ఈ పరిస్థితిని బ్రేక్ చేసే బ్లాక్ బస్టర్ అవసరం పరిశ్రమకు చాలా ఉంది

Also Read : Allu Arjun : ఐకాన్ స్టార్ పాన్ ఇండియా ప్రమోషన్ ప్లాన్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి