iDreamPost

లాక్ డౌన్ పొడిగింపు.. కేంద్రం కీలక ప్రకటన

లాక్ డౌన్ పొడిగింపు.. కేంద్రం కీలక ప్రకటన

దేశంలో కరోనా వైరస్ నియంత్రణలోకి రాకపోవడంతో లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాల పాటు పొడిగించింది. మూడో విడత లాక్ డౌన్ ఈనెల 17వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన చేసింది. విపత్తు నిర్వహణ చట్టం – 2005 కింద లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

రెడ్ జోన్లలో ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. నిబంధనల మేరకు గ్రీన్, ఆరెంజ్ లో కొన్ని సడలింపులు ఉంటాయని తెలిపింది. మే 17వరకు అంతరాష్ట్ర రవాణాపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. గ్రీన్ జోన్లో పరిమిత సంఖ్యలో బస్సులు తిరుగుతాయని వెల్లడించింది. గ్రీన్ జోన్లలో జిల్లాల మధ్య రాకపోకలకు అనుమతి ఇచ్చింది. కేసుల సంఖ్య, వైరస్ వ్యాప్తి ఆధారంగా జోన్ల ను నిర్ధారించుకుని ఉంటామని వెల్లడించింది. కంటోన్మెంట్ జోన్లు,హాట్ స్పాట్ లలో లాక్ డౌన్100% కొనసాగుతుందని స్పష్టం చేసింది. విద్యా సంస్థలు, పాఠశాలలు, సినిమా హాళ్లపై ఆంక్షలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది.

ఎల్లుండి తో లాక్ డౌన్ గడువు ముగుస్తున్న సమయంలో ఈ రోజు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు జరుగుతున్న తీరు, కరోనా నియంత్రణ చర్యలపై మంత్రివర్గం చర్చించింది. అదే విధంగా లాక్ డౌన్ పొడిగింపు పై చర్చ సాగింది. రేపు లేదా ఎల్లుండి లాక్ డౌన్ పొడిగింపుపై ప్రధానమంత్రి మోదీ ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రకటన లేకుండానే హోంమంత్రిత్వశాఖ లాక్ డౌన్ పొడిగింపుపై ప్రకటన చేయడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి