iDreamPost

ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ భూకంపం.. పరుగులు తీసిన జనం!

  • Published Oct 11, 2023 | 12:53 PMUpdated Oct 11, 2023 | 12:53 PM
  • Published Oct 11, 2023 | 12:53 PMUpdated Oct 11, 2023 | 12:53 PM
ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ భూకంపం.. పరుగులు తీసిన జనం!

ఇటీవల ప్రపంచ దేశాల్లో భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎక్కువగా భారత్, నేపాల్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, జపాన్ లాంటి దేశాల్లో తరుచూ భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపాల్లో ఏకంగా 50 వేల మందికి పైగా మృతి చెందారు. కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇక ఆఫ్ఘనిస్థాన్, ఇండోనేషియా, భారత్ లో నెలల వ్యవధిలోనే పలుమార్లు భూకంపాలు సంభవిస్తున్నాయి. భూకంపాల ధాటికి ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. శనివారం పశ్చిమఆఫ్ఘనిస్తాన్ లోభారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.. ఇది మరువక ముందే నేడు అదే ప్రాంతంలో మరోసారి భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే..

గత కొంత కాలంగా వరుస భూకంపాలతో ఆఫ్ఘనిస్థాన్ గజ గజ వణికిపోతుంది. శనివారం, అక్టోబర్ 7న పశ్చిమ ఆఫ్ఝనిస్థాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.9 గా చూపించింది. ఈ భూకంప ధాటికి దాదాపు రెండువేల మందికి పైగా మరణించారని తాలిబన్ అధికారులు వెల్లడించారు. హెరాత్ లోని జిందా జన్ జిల్లా లో 7.7 కిలోమీటర్ల లోతులో భూకంప ప్రభావం కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూకంప ధాటికి అనేక గ్రామాలు ధ్వంసం అయ్యాయి.. ఎంతోమంది గాయపడ్డారు. ఇక్కడ మొత్తం ఆరుసార్లు వెంట వెంటనే భూమి కంపించింది. ఫరా, బద్గీస్ ప్రావిన్సు లో సైతం భూమి కంపించింది. ప్రస్తుతం ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలోనే ఇదే ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది.

ఆఫ్ఘనిస్తాన్ లోని హెరాత్ ప్రావిన్స్ లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతగా నమోదు అయ్యింది. హెరాత్ ప్రావిన్స్ లో 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. ఇటీవల ఇదే ప్రాంతంలో భూకంపం వచ్చి రెండువేల మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన మరువక ముందే మరోసారి భూకంపం వచ్చింది. తాజాగా సంభవించిన భూకంపంపై ఆఫ్ఝనిస్థాన్ అధికారిక వర్గాలు పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది. వరుస భూకంపాంలతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి