iDreamPost

ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కాం.. కళా వెంకటరావుకు మోపు చేస్తున్నారా..?

ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కాం.. కళా వెంకటరావుకు మోపు చేస్తున్నారా..?

ఏపీ ఫైబర్‌నెట్‌ స్కాంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ను తప్పించేందుకు రంగం సిద్ధమైందా..? ఆయన స్థానంలో మాజీ మంత్రి కళా వెంకటరావు బలి కాబోతున్నారా..? అంటే అవుననేలా పరిస్థితులు మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఏపీ ఫైబర్‌ నెట్‌లో 2 వేల కోట్ల రూపాయల స్కాం జరిగిదనే ఆరోపణలు వస్తే.. విచారణ చేసుకోండి, తాను ఏ తప్పూ చేయలేదని నారా లోకేష్‌ చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. ఓ వైపు విచారణ చేసుకోమని చెబుతూనే.. మరో వైపు విచారణ పేరుతో వేధిస్తే కోర్టులను ఆశ్రయిస్తామంటున్నారు చంద్రబాబు ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పని చేసిన వేమూరి హరిప్రసాద్‌.

ఏపీ ఫైబర్‌ నెట్‌ వ్యవహారంలో 2 వేల కోట్ల రూపాయల స్కాం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో వేమూరి హరిప్రసాద్‌ నిన్న హైదరాబాద్‌లో ఈ అంశంపై విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేమూరి మాట్లాడుతూ.. ఫైబర్‌ నెట్‌ సంస్థతో ఏపీ ఐటీ శాఖ మాజీ మంత్రి నారా లోకేష్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫైబర్‌ నెట్‌ సంస్థ ఐటీ శాఖది కాదని, విద్యుత్‌శాఖదని కొత్త విషయం చెప్పారు. తాను జీతం తీసుకోకుండానే ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారుడుగా పని చేశానని చెప్పకొచ్చారు.

Read Also; డ్రామా అయితే.. స్టేలు ఎందుకు..?

వేమూరి హరిప్రసాద్‌ మాటలు.. గుమ్మడి కాయ దొంగ ఎవరంటే.. భుజాలు తడుముకున్నట్లుగా ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీ ఫైబర్‌ నెట్‌ సంస్థలో అక్రమాలు జరగకపోతే ఎందుకు ఉలిక్కిపడుతున్నారనే ప్రశ్న వినిపిస్తోంది. పైగా.. ఈ సంస్థ ఐటీ శాఖది కాదని, విద్యుత్‌ శాఖదని చెబుతూ నారా లోకేష్‌ను ఈ కుంభకోణం నుంచి తప్పిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నేరం జరగడం వాస్తవం కావడంతోనే.. దాన్ని మరొకరి మెడకు వేసేందుకే ఐటీ శాఖది కాదని హరిప్రసాద్‌ చెబుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కాంను అప్పటి విద్యుత్‌ శాఖ మంత్రి కళా వెంకటరావుకు మోపు చేస్తున్నారనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

తాను ఐటీ శాఖ సలహారుడుగా పని చేశానని వేమూరి చెప్పారు. అదే సమయంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ సంస్థ ఐటీ శాఖ పరధిలోనిది కాదని, విద్యుత్‌ శాఖదని చెప్పుకొస్తున్నారు. ఏపీ ఫైబర్‌ నెట్‌ విద్యుత్‌ శాఖదే అయితే.. ఐటీ శాఖ సలహాదారుగా పని చేసిన వేమూరి హరిప్రసాద్‌కు వచ్చే ఇబ్బంది ఏముంటుందనే మౌలిక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఐటీ శాఖ సలహాదారుడుకు విద్యుత్‌ శాఖ పరిధిలోని ఫైబర్‌ నెట్‌ సంస్థతో ఎలాంటి సంబంధం ఉండదు. ఇలాంటప్పుడు ప్రభుత్వం ఏ సంస్థతో విచారణ చేయించినా.. వేమూరి హరిప్రసాద్‌కు వచ్చే ముప్పు ఏమీ ఉండదు కదా..? అనే మాట వినిపిస్తోంది.

ఒక వేళ హరిప్రసాద్‌ భయపడుతున్నట్లు.. ఏపీ ప్రభుత్వం తనపై కేసు పెట్టినా.. విద్యుత్‌ శాఖ పరిధిలోని ఫైబర్‌ నెట్‌తో తనకు ఏమి సంబంధం అని చెప్పవచ్చు. ఇది వదిలేసి.. ఫైబర్‌ నెట్‌ సంస్థలో ఎన్ని కోట్ల లావాదేవీలు జరిగాయనే వివరాలు వేమూరి హరిప్రసాద్‌ చెప్పాల్సిన పని లేదు కదా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీ ఫైబర్‌ నెట్‌ సంస్థలో ప్రభుత్వం 770 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. 2 వేల కోట్ల రూపాయల కుంభకోణం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించడంతోనే భుజాలు తడుముకుంటున్నట్లుగా ఉందంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం అటు ఇటు తిరిగి కళా వెంకటరావు వద్దకు వచ్చి ఆగేలా ఉందన్నది తాజా పరిస్థితులతో అర్థమవుతోంది.

Read Also; నిన్న రాజ్య సభలో వెంకయ్యే ఉండుంటే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి