iDreamPost

రైతుకు అండ – ప్రతి పంటకు భీమా

రైతుకు అండ – ప్రతి పంటకు భీమా

ఆంధ్రప్రదేశ్ లో పంటలకు 100 శాతం భీమా కల్పించే లక్ష్యం తో జగన్ సర్కార్ కొత్త పధకం ప్రకటించింది. ఈ రబీ సీజన్ నుంచే ఈ పధకం అమలు చేస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని నిర్ధేశించిన ప్రాంతాల్లో పంటల బీమా కోసం వ్యవసాయ శాఖ గుర్తించిన వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు దారులందరికీ వంద శాతం బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించి.. పరిహారం సొమ్మును వారి ఖాతాలకు చెల్లించే బాధ్యతను చేపడుతుంది.

అలాగే పంటల బీమా పథకం అమలు కోసం ఏపీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో ఇచ్చిన విషయం విదితమే. ఈ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2013 కంపెనీల చట్టానికి అనుగుణంగా రూ.101 కోట్ల వాటా ధనంతో ఇది ఏర్పాటవుతుంది. వ్యవసాయ రంగ బీమా అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వమే ఈ మొత్తాన్ని సమకూర్చుతుంది. ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది.

పంటల బీమా అమలు ఇలా..

– గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ, రెవెన్యూ శాఖల పర్యవేక్షణ, తనిఖీ అనంతరం.. వ్యవసాయ శాఖ నిర్దేశించిన తేదీల మేరకు పంటల బీమాకు అర్హులైన సాగుదారులకు సంబంధించిన సమాచారాన్ని వ్యవసాయ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్‌ చేస్తారు. అలా గుర్తించిన వారినే పథకానికి అర్హులుగా గుర్తిస్తారు.

– ప్రధానమంత్రి పంటల బీమా యోజన, పునర్‌వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంలో పంట నష్టం, పరిహారం నిర్దారణ సమయంలో అవసరం మేరకు మార్పులు చేర్పులు చేయవచ్చు.

– పథకం అమలులో సాగుదారులు లేదా ప్రభుత్వం ఏ సంస్థకూ ప్రీమియం సబ్సిడీ చెల్లించదు. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా పంటల బీమాకు 
అర్హమైన క్లెయిమ్స్‌ పరిష్కరిస్తుంది. సంబంధిత సాగుదార్ల ఆధార్‌ అనుసంధానిత బ్యాంక్‌ ఖాతాలకు నేరుగా క్లెయిమ్‌ మొత్తాలు జమ చేస్తారు.

– ఈ పథకం అమలుకు వ్యవసాయ శాఖ నోడల్‌ విభాగంగా వ్యవహరిస్తుంది. పంట కోతల ప్రయోగాలు, క్లెయిమ్‌ల పరిష్కారాల కోసం ఎప్పటికప్పుడు అజమాయిషీ, సమన్వయం ఉండేలా చూస్తుంది. రెవెన్యూ విభాగం కూడా బాధ్యురాలిగా వ్యవహరిస్తుంది. ప్రణాళికా విభాగం సకాలంలో పంట కోతల ప్రయోగాలు చేపట్టడంతో పాటు, పంట దిగుబడికి సంబంధించిన సమాచారం అందచేస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి