iDreamPost

వారికి సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఎన్నికల కంటే ముందే పరిహారం!

వారికి సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఎన్నికల కంటే ముందే పరిహారం!

అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. ఈ పర్యటనలో సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వరదసాయం అందరికీ అందిందని వ్యాఖ్యానించారు. ఎవరికైనా అందకపోతే ధైర్యంగా తనకు చెప్పాలని చెప్పారు. వరదసాయం విషయంలో కలెక్టర్లను అన్ని రకాలుగా యాక్టివ్ చేశానని, ఏ ఒక్కరు మిగిలిపోకుండా సహాయక కార్యక్రమాలు చేపట్టామని సీఎం జగన్ తెలిపారు.

“మీ కలెక్టర్‌ మీకు బాగానే పని చేశారా? ఎవరైనా సరే ముందుకు వచ్చి మీకు  మంచి జరగకపోతే నా ఎదుటే చెప్పండి. ఎందుకు మంచి జరగలేదో నేనే స్వయంగా అడుగుతా. ప్రతి ఒక్కరికి మంచి జరిగించాలనే తపన, తాపత్రయంతో మన ప్రభుత్వం పని చేస్తోంది. ఇళ్లలోకి నీరు వచ్చిన పరిస్థితుల్లో ఏ ఒక్కరిని వదలకుండా నిత్యావసర సరుకులు ఇవ్వడమే కాకుండా.. రూ.2 వేలు సాయం చేయాలని ఆదేశించాను. ఎవరికైనా ఈ సాయం అందకపోతే నాకు చెప్పండి. కచ్చా ఇళ్లు కానీ, ఇల్లు దెబ్బతిని ఉంటే అందులో వ్యత్యాసం చూపకుండా పేదవాడికి  మేలు చేసేలా ప్రతి ఇంటికి రూ.10 వేలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశాను. అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

లిడార్ సర్వే ద్వారా మంచి:

ముంగు గ్రామాలకు మంచి చేసేందుకు లిడార్‌ సర్వే చేయించానని సీఎం జగన్ పేర్కొన్నారు. లిడార్‌ సర్వే ద్వారా 48 పునరావాసాలను సైంటిఫిక్‌గా తీసుకున్నామని తెలిపారు. ఈ గ్రామాల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, నీళ్లు నింపాలంటే మూడు దఫాలుగా నింపాలని స్పష్టం చేశారు. అలా చేయకపోతే డ్యామ్‌ లికేజీ అవుతుందని సీఎం జగన్ అన్నారు. మొదటి దశలో 41.15 దాకా డ్యామ్‌లో నీళ్లు నింపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. కాంటూర్‌ లెవల్‌లో వచ్చే ప్రతి నిర్వాసితులకు ప్యాకేజీ ఇస్తామని, ఆర్‌ అండ్‌ ఆర్‌ ఇచ్చేవారికి పరిహారం ఇస్తామని సీఎం భరోసా ఇచ్చారు. లిడార్‌ సర్వే ద్వారా 32 గ్రామాలకు సంబంధించి మొదటి దఫాలో చేర్చామని, బాధితులకు రావాల్సిన పరిహారం ఇస్తామని అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే లిడార్‌ సర్వే పూర్తి చేయించామని తెలిపారు. ఈ నెలాఖరులోగా కేబినెట్‌ ఆమోదం పొందవచ్చని, సీడబ్ల్యూసీలో కూడా వారం రోజుల క్రితమే ఈ జాబితా చేరిందని సీఎం జగన్ తెలిపారు. కేంద్ర జలశక్తికి సీడబ్ల్యూసీకి క్లియర్‌ చేసి పంపుతారని, ఈ సమస్యను కేంద్రం పరిష్కరించే దిశగా ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు.

నాకు క్రెడిట్ వద్దు:

“పోలవరానికి సంబంధించి ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఒక్కటే చెప్పాను. అయ్యా.. మీరే బటన్‌ నొక్కండి.. మీరే నేరుగా నిర్వాసితులకు డబ్బులు జమ చేయండి. నాకు కావాల్సిందల్లా మా వాళ్లకు మంచి జరగాలి. వారికి నేరుగా డబ్బులు అందాలని ప్రధానికి చెప్పాను” అని సీఎం జగన్ వెల్లడించారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద ఇవ్వాల్సినవన్నీ కూడా త్వరలోనే అందుతాయన్నారు. ఇక్కడి ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఇది జరగాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6.8 లక్షలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మరో రూ.3.2 లక్షలు ఇస్తామని ఇప్పటికే జీఓ రిలీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. దీనికి మీ బిడ్డ కట్టుబడి ఉన్నాడని సీఎం జగన్ ఉద్ఘాటించారు. కేంద్రం డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టగానే మీ బిడ్డ ఇవ్వాల్సిన రూ.3.2 లక్షలు ఇచ్చే కార్యక్రమం చేస్తానని, దశలవారీగా ఇచ్చుకుంటూ పోతానని సీఎం జగన్ స్పష్టం చేశారు. కేంద్రం కూడా త్వరలోనే స్పందిస్తుందని ముఖ్యమంత్రి నమ్మకంగా చెప్పారు. కచ్చితంగా వచ్చే ఎన్నికలకు ముందే మంచి జరుగుతుందని భావిస్తున్నట్లు సీఎం జగన్ అన్నారు. వచ్చే ఆరేడు నెలల్లో అందరికీ పరిహారం అందుతుందని సీఎం జగన్‌ తెలిపారు.

సీఎం స్థానంలో కూర్చుం మీ కోసమే:

“గత ప్రభుత్వం మాదిరిగా పోలవరం మేమే కడుతామని, కేంద్రం వద్ద అబద్ధాలు చెప్పడం లేదు. అప్పటి సీఎం చంద్రబాబు బుద్ధి లేకుండా నిర్వాసితులను మోసం చేశారు. మీ బిడ్డ అలా చేయడు” అని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైఎస్సార్ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు ల్యాండ్‌ అక్విజేషన్‌ చేసినప్పుడు రూ.1.50 లక్షలకు జరిగిందని అన్నారు. దాన్ని తాను చెప్పినట్లుగా రూ.5 లక్షలు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మిగిలిన రూ.3.50 లక్షలు ఇస్తానని సీఎం జగన్‌ తెలిపారు. మీ బిడ్డ వల్ల ఏ ఒక్కరూ నష్టపోయామనే మాట ఎక్కడా వినపడదని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి