iDreamPost

కాదేది ట్యూన్ కి అనర్హం అంటున్న దేవిశ్రీ ప్రసాద్

కాదేది ట్యూన్ కి అనర్హం అంటున్న దేవిశ్రీ ప్రసాద్

సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ కున్న పేరు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు మణిశర్మ ప్రభంజనాన్ని తట్టుకుని సరికొత్త మ్యూజిక్ తో యూత్ ని విపరీతంగా ఆకట్టుకుని రాక్ స్టార్ గా ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తి. ఆర్య, వర్షం, భద్ర, శంకర్ దాదా ఎంబిబిఎస్, లెజెండ్ ఇలా చెప్పుకుంటూ పొతే లెక్క లేనన్ని చార్ట్ బస్టర్స్ ఉన్నాయి. అయితే తమన్ వచ్చాక దేవి స్పీడ్ కొంత తగ్గిన మాట వాస్తవం. మరీ ముఖ్యంగా గత నాలుగైదేళ్లలో సుకుమార్ తో అసోసియేట్ అయిన సినిమాలకు తప్పించి మిగిలినవాటికి అంతగా చెప్పుకోదగ్గ స్కోర్ ఇవ్వలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంత గ్యాప్ తర్వాత వాల్తేరు వీరయ్యతో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాడు

ఇందులో చిరంజీవి రవితేజ కలిసి నటించిన పూనకాలు లోడింగ్ పాట మ్యూజిక్ లవర్స్ కి బాగా రీచ్ అవుతున్న సంగతి తెలిసిందే. లిరికల్ వీడియోలో బూర లాంటి వాయిద్యాన్ని పట్టుకుని దేవి వాయించిన తీరు వెరైటీగా అనిపించింది. దాని తాలూకు కథా కమామీషు దేవి స్వయంగా చెప్పాడు. ఓసారి గోవా వెళ్ళినప్పుడు ఓ మ్యూజికల్ ఇన్స్ట్రు మెంట్స్ అమ్మే షాపు కనిపించింది. సహజంగానే అందులో ఏముంటాయనే ఆసక్తితో దేవి అందులోకి వెళ్లి ఒక్కొక్కటి చూడటం మొదలుపెట్టాడు. చిన్న పిల్లలు ఆడుకునే బూర ఒకటి ఆకుపచ్చ రంగులో కొత్తగా అనిపించి ఆలస్యం చేయకుండా కేవలం 250 రూపాయలకు దాన్ని వెంటనే కొనేసుకుని స్టూడియోకు తెచ్చుకున్నాడు.

సరిగ్గా అప్పుడే దర్శకుడు బాబీ మెగాస్టార్ మాస్ మహారాజా కాంబోలో సాంగ్ గురించి చెప్పడం, వింటే పూనకాలు రావాలని బాస్ చెప్పారని హింట్ ఇవ్వడం, ఆ పదాన్నే తీసుకుని ఆ బూర ఉపయోగించి ట్యూన్ కట్టేయడం చకచకా జరిగిపోయాయి. లక్షలు కోట్లు ఖరీదు చేసే సామాగ్రి కాకుండా ఇలా చిన్న బూరతో వాయించడం బాగానే ఉంది కానీ బాస్ పార్టీ రేంజ్ లో ఇది అంత కిక్ ఇవ్వలేకపోయిందనే ఫీడ్ బ్యాక్స్ కూడా వినిపిస్తున్నాయి. మరీ గుడ్డిగా ఆ బూరనే నమ్ముకోవడం వల్ల క్వాలిటీ తగ్గిందేమో మరి. వాల్తేరు వీరయ్య నుంచి నీకు అందమెక్కువ నాకు తొందరెక్కువ పాట ఒకటే బాలన్స్ ఉంది. దీన్ని వచ్చే వారం రిలీజ్ చేయబోతున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి