iDreamPost

మళ్లీ కంప్లీట్ లాక్ డౌన్..! వాస్తవమేనా?

మళ్లీ కంప్లీట్ లాక్ డౌన్..! వాస్తవమేనా?

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఆదివారం అర్థరాత్రి నాటికి 3,15,850 వరకూ నమోదయ్యాయి. మరణాలు 9195 వరకూ ఉన్నాయి. లాక్ డౌన్ సడలింపు ల అనంతరం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జూలై లో అయితే దాదాపు రోజుకు పది వేలకు చేరువ లోనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అయితే 11, 458 కేసులు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజుకు 200 పైగానే పాజిటివ్ రోగులు ఉంటున్నారు. ఈ నెల 13న శనివారం రోజు అయితే రికార్డ్ స్థాయిలో తెలంగాణలో 253, ఆంధ్రప్రదేశ్ లో 222 కరోనా కేసులు వచ్చినట్లు ఆయా రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఒక రేంజ్ లో ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే కరోనా విజృంభణ నేపథ్యంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారాంతాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు మరింత కఠినతరంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సామాజిక వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వైద్య, పారిశుధ్య, ఇతర అత్యవసర సేవా విభాగాల సిబ్బంది తప్ప మిగతా వారు బయటకు రావద్దని తెలిపారు. తప్పనిసరి బయటకు రావలసి ఉంటే కరోనా వైరస్‌ అలర్ట్‌ యాప్‌ నుంచి ఇ-పాసులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని నిబంధన పెట్టారు. అదే విధంగా పెద్ద సంఖ్యలో పౌరులు ఒక్కచోట చేర కుండా చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర డీజీపీ ను ఆదేశించారు. ప్రజలు నిబంధనలు పాటించకపోతే కేసులు లక్షలలో పెరుగుతాయని, అదే జరిగితే మళ్లీ లాక్ డౌన్ విధించాలి ఉంటుందని మహారాష్ట్ర ముఖ్య మంత్రి కూడా హెచ్చరించారు. అలాగే ఢిల్లీ లోనూ కంప్లీట్ లాక్ డౌన్ అంటూ, తెలంగాణ లోని గ్రేటర్ హైదరాబాద్ లోనూ త్వరలో మొత్తం లాక్ డౌన్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్పినట్లు వార్తలు గుప్పు మన్నాయి. కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని కొట్టి పారేశాయి. ఇది ఇలా ఉంటే.. జూన్ 15 తర్వాత ఎప్పుడైనా పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించేందుకు కేంద్రం ఆలోచిస్తుందని, విమానాలు, రైళ్ల రాకపోకలు బంద్ అవుతాయని సోషల్ మీడియాలో మరో వార్త విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రజలు ఒకరికొకరు ఫోన్లు చేసుకుని నిజమేనా అంటూ వాకబు చేస్తుండడం… చర్చిస్తూ ఉండడం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరో ఒకరు దీనిపై క్లారిటీ ఇస్తున్నా ఈ ప్రచారాలు ఆగడం లేదు.

ఈ నెల 16, 17 న ప్రధాని నరేంద్ర మోడీ సీఎం లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చనున్నారు. కొన్ని రాష్ట్రాల సీఎంలతో ఒకరోజు, మరి కొన్ని రాష్ట్రాల సీఎంలతో ఒకరోజు మాట్లాడనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో కరోనా కట్టడి, లాక్ డౌన్ పైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. 17న తెలుగు రాష్ట్రాల సీఎం లతో ప్రధాని మాట్లాడతారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రధాని సీఎం లతో చర్చించ నున్నట్లు తెలుస్తోంది. సీఎం లతో మోడీ సమావేశం అనంతరం మళ్లీ కంప్లీట్ లాక్ డౌన్ వార్తల పై పూర్తి స్థాయిలో క్లారిటీ రానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి