iDreamPost

ఇది ఈనాడు తీరు .. ఇందుకే విశ్వసనీయత కోల్పోయింది

ఇది ఈనాడు  తీరు ..  ఇందుకే విశ్వసనీయత కోల్పోయింది

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎల్లోమీడియా ఏ స్ధాయిలో రెచ్చిపోతోంది అనేందుకు ఓ తాజా ఉదాహరణ. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎల్లోమీడియా విపరీతంగా రెచ్చిపోతోంది. నిజానికి చంద్రబాబునాయుడు రక్షణే ధ్యేయంగా ఈ మీడియా రెచ్చిపోతోందన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారు కాబట్టి ఎల్లోమీడియా కూడా రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ మొత్తం దేశాన్నంతిటిని వణికించేస్తున్న మాట వాస్తవం. వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆపటం సాధ్యం కావటం లేదు. పైగా దేశం మొత్తం లాక్ డౌన్లో ఉన్నా కేసుల తీవ్రత మాత్రం పెరిగిపోతోంది. ఈ సమయంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత నిజానికి మీడియాపైన చాలానే ఉంటుంది. అలాంటిది మరి ప్రజల మీదో లేకపోతే జగన్ మీదో కక్ష సాధింపుగానా అన్నట్లుంటోంది ఆ మీడియా అందిస్తున్న కథనాలు.

కరోనా వైరస్ విషయాన్నే తీసుకుంటే ఆదివారం ఈనాడు దినపత్రిక ఏపి ఎడిషనల్లో ఒకవిధంగా తెలంగాణా విషయానికి వచ్చేటప్పటికి మరో విధంగా కథనాలను అచ్చేసింది. ఏపిలో ఏమో ’97 మండలాలు రెడ్ జోన్లో’ ఉందంటూ జనాలను భయపెట్టే రీతిలో బ్యానర్ కథనాన్ని అచ్చేసింది. అదే తెలంగాణాకు వచ్చేసరికి జనాలను అప్రమత్తంగా ఉండాలంటూ ’జర భద్రం బిడ్డా’ అంటూ జాగ్రత్తలు చెబుతున్నట్లుగా బ్యానర్ కథనం ఇచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపిలోకన్నా తెలంగాణాలోనే పరిస్ధితి ఆందోళనకరంగా ఉంది.

ఏపితో పోల్చుకుంటే తెలంగాణాలోనే వైరస్ కేసులు ఎక్కువ, మరణాలూ ఎక్కువే. తాజా సమాచారం ప్రకారం తెలంగాణాలో 858 పాజిటివ్ కేసులుంటే 21 మంది చనిపోయారు. అలాగే ఏపిలో 647 మంది బాధితులుంటే 17 మంది చనిపోయారు. తీవ్రత ఎక్కువున్న తెలంగాణాలో జనాలను అప్రమత్తం చేయటంలో భాగంగా ఏపి ఎడిషన్లో పెట్టిన బ్యానర్ హెడ్డింగ్ పెట్టాల్సింది. అలాగే తెలంగాణా ఎడిషన్లో పెట్టిన హెడ్డింగ్ ఏపి ఎడిషన్ బ్యానర్ గా పెట్టాల్సింది. కానీ ఉల్టాగా బ్యానర్ కథనాలు ఇచ్చింది. ఎందుకిలా ఇచ్చింది ? ఎందుకంటే భయం. కేసియార్ అంటే ఎల్లోమీడియా యాజమాన్యాలకు వణుకు. ఉన్న విషయాన్ని ఉన్నదున్నట్లు చెప్పినా అంతే సంగతులు.

కేసియార్ కు మండిందంటే ఏ మీడియాను ఎంత లోతులో బొంద పెడతాడో తెలీదు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీవ్రతను కూడా తక్కువగానే చూపిస్తుంటుంది. ఆల్రెడి కేసియార్ దెబ్బేంటో గతంలోనే రెండు మీడియా యాజమాన్యాలు బాగా రుచిచూశాయి. అప్పటి నుండి మీడియా స్వేచ్చని ఇంకోటని మరోటని నోరెత్తితే ఒట్టు. అంటే చంద్రబాబు ఇంట్రస్టులను కూడా పక్కన పెట్టేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని తెలంగాణాలో పనిచేస్తున్నాయి.

అదే మరి ఏపికి వచ్చేసరికి ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నాయి. ఎందుకంటే జగన్ పై ఏమి రాసినా పట్టించుకునే వాడే లేడు. తెలంగాణాలో ఉన్నదున్నట్లు రాయటానికి కూడా భయపడే మీడియా ఏపి విషయానికి వచ్చేసరికి లేనిది కూడా ఉన్నట్లు తప్పుడు కథనాలతో రెచ్చిపోతుంటుంది. మీడియా ఏమి రాసినా జగన్ పట్టించుకోవటం లేదు. ఇలా రాసే మొన్నటి ఎన్నికల్లో ఎల్లోమీడియా జనాల విశ్వసనీయతను కోల్పోయింది. అయినా ఇంకా ఈ మీడియాకు బుద్ధి రాలేదు. దానికి తాజా నిదర్శనమే పై ఫొటో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి