iDreamPost

పింఛన్ పంపిణీలో ఆలస్యం.. వాలంటీర్లపై వేటు

పింఛన్ పంపిణీలో ఆలస్యం.. వాలంటీర్లపై వేటు

పింఛన్ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. పింఛన్ల పంపిణీలో జాప్యం చేశారంటూ ఇద్దరు గ్రామ వలంటీర్లను విధుల నుంచి తప్పించాలని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే వారిని విధుల నుంచి తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆదివారం మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 21వ వార్డు జవ్వారుపేట టేక్యా ప్రాంతంలో మంత్రి పేర్ని నాని పర్యటించారు.

ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం మచిలీపట్నం 10వ వార్డులో పింఛన్లు ఇవ్వడంలో ఇద్దరు గ్రామ వలంటీర్లు ఆలస్యం చేశారని మంత్రి దృష్టికి వచ్చింది. దీంతో వారిపై మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించడమే కాక అడ్మిన్‌ నవీన్‌ అలసత్వంపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, మార్చి 1వ తేదీ ఆదివారం అయినప్పటికీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇంటి వద్దకే పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది.

ఉదయం నుంచే గ్రామ, వార్డు వలంటీర్లు ఇళ్ల వద్దకు వెళ్లి ఫించన్లు అందజేస్తున్నారు. పలు ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పేర్ని నాని దగ్గరుండి పర్యవేక్షించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి