iDreamPost

ఆయన ఆలిండియా ముద్దపప్పు.. ఈయన తెలంగాణ ముద్దపప్పు: కేటీఆర్‌

  • Published Nov 03, 2023 | 8:59 AMUpdated Nov 03, 2023 | 9:29 AM

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మీద కాంగ్రెస్‌ నేతలు చేస్తోన్న విమర్శలని తిప్పి కొట్టారు బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌. రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డిలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా వారిద్దరిని పప్పంటూ ఎద్దేవా చేశారు. ఆ వివరాలు..

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మీద కాంగ్రెస్‌ నేతలు చేస్తోన్న విమర్శలని తిప్పి కొట్టారు బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌. రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డిలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా వారిద్దరిని పప్పంటూ ఎద్దేవా చేశారు. ఆ వివరాలు..

  • Published Nov 03, 2023 | 8:59 AMUpdated Nov 03, 2023 | 9:29 AM
ఆయన ఆలిండియా ముద్దపప్పు.. ఈయన తెలంగాణ ముద్దపప్పు: కేటీఆర్‌

తెలంగాణలో ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతుంది. పార్టీలన్ని దూకుడు పెంచాయి. ప్రచార కార్యక్రమాలతో నేతలంతా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఎన్నికల సందర్భంగా రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ కాళ్లేశ్వరం ప్రాజెక్ట్‌ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది అంటూ ఆరోపణలు చేశారు. అయితే రాహుల్‌ గాంధీ ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. రాహుల్‌ గాంధీ ఆల్‌ ఇండియా పప్పైతే.. రేవంత్‌ రెడ్డి తెలంగాణ పప్పంటూ ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘రేవంత్‌రెడ్డి తెలంగాణ పప్పయితే.. రాహుల్‌ గాంధీ ఆల్‌ ఇండియా ముద్దపప్పు రాహుల్‌ గాంధీ. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయ్యమన్నట్లు మాట్లాడుతున్నారు వీళ్లిద్దరూ. ఈ ఇద్దరు బిత్తిరోళ్లు ఎగేసుకుని పోయి కాళేళ్వరం ప్రాజెక్టును చూసి వచ్చి.. మహా ఇంజనీర్లలా బ్రిడ్జి కూలిపోతుందని తప్పు డు ప్రచారం చేస్తున్నారు. బ్రిడ్జిపై ఉండే ఎక్స్‌పాన్షన్‌ జాయింట్ల ఫొటోలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయం అనడం రాహుల్, రేవంత్‌ల అవగాహనారాహిత్యానికి నిదర్శనం’’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేటీఆర్‌.

కాళేశ్వరం వరం.. కాంగ్రెస్‌ శనీశ్వరం

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి వరమైతే.. కాంగ్రెస్‌ పార్టీ దేశానికి శనీశ్వరం. బీఆర్‌ఎస్‌ది కుటుంబ పాలనంటూ విమర్శిస్తున్న.. రాహుల్‌ తన కుటుంబ నేపథ్యం ఏమిటో చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టులోని చిన్న లోపాలను పెద్దవిగా చూపి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండు జీవనదుల నడుమ ఉన్న తెలంగాణను.. సుమారు 60 దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్‌ తీవ్ర కరువు ప్రాంతంగా మార్చింది. కాంగ్రెస్‌ పుణ్యాన తెలంగాణలో నేల నెర్రెలు వారింది. అది విప్లవ ఉద్యమాల నెత్తురుతో ఎర్రవారింది. రాహుల్‌ గాంధీకి తెలంగాణ చరిత్ర తెలియదు. తెలుసుకొనే సోయి, పరిజ్ఞానం కూడా లేదు. 60 ఏళ్ల పాలనలో తెలంగాణలో ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణం జరగలేదు. కాంగ్రెస్‌ పాలన సక్రమంగా జరిగి ఉంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎందుకు ఉద్యమించే వాళ్లం..’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చాక వరిసాగులో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థాయికి ఎదిగింది. ప్రాజెక్టు ఫెయిలైతే 3.50 కోట్ల టన్నుల ధాన్యం ఎలా పండింది.. కాళేశ్వరం గురించి ఆయన పక్కన ఉన్న సన్నాసులు చెప్పేది కాకుండా రాహుల్‌ వాస్తవాలు తెలుసుకుంటే మంచిది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ విమర్శించడం వారి అవగాహనరాహిత్యాన్ని తెలియజేస్తుంది. ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణపై దాడి చేస్తే సహించేది లేదు’’ అని కేటీఆర్‌ హెచ్చరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి