Arjun Suravaram
Arjun Suravaram
ఉత్తర భారత దేశంలో వరదలు విజృభిస్తున్నాయి. ఈ భారీ వానల దెబ్బలకి ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అలకనంద నదిపై ఉన్న వంతెనపై ట్రాన్స్ ఫార్మర్ పేలి.. కరెంట్ షాక్ తగలడంతో 15 మంది మృతి చెందారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లలోని అలకనందా నదిపై ఉన్న డ్యామ్ వద్ద విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పేలింది. ఆ సమయంలో వంతెనపై ఉన్న వాళ్లకు కరెంట్ షాక్ తగిలింది. కొందరు అక్కడికక్కడే కుప్పకూలి 15 మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షత్రులను చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయాపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక మృతుల్లో ఎస్ఐ, హోంగార్డులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో పీపల్ కోటి అవుట్ పోస్టు ఇంఛార్జీ కూడా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరమేంద్ర దోవల్ వెల్లడించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగినట్లు ఎస్పీ వెల్లడించారు.
ట్రాన్స్ ఫార్మర్ పేలిపోవడం వల్ల వంతెన రెయిలింగ్ కు విద్యుత్ సరఫరా జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనే స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అలాగే ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని అధికారులను ఆదేశించారు. “ఇది ఎంతో బాధించే ఘటన. సహాయక చర్యల నిమిత్తం పోలీసులు, ఎన్టీఆర్ఎప్ బృందం ఘటనా స్థలిలో ఉన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తాం” అని సీఎం వెల్లడించారు. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: వీడియో: నదులను తలపిస్తున్న వీధులు.. ఎటు చూసినా నీరే!