iDreamPost

శంకర్ సినిమాలో టెర్రిఫిక్ ఎపిసోడ్

శంకర్ సినిమాలో టెర్రిఫిక్ ఎపిసోడ్

ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రామ్ చరణ్ శంకర్ ల కాంబో ప్రాజెక్ట్ త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఆచార్యలో తన చివరి సీన్లు పాటను పూర్తి చేసిన చెర్రీ అటు ఆర్ఆర్ఆర్ బ్యాలన్స్ కూడా దాదాపు ఫినిష్ చేసినట్టే. రాజమౌళి నుంచి ఏదైనా ప్రమోషన్ కోసం ప్రత్యేకంగా పిలుపు వస్తే తప్ప. ఇద్దరు హీరోల మీద పబ్లిసిటీ కోసం ఒక ప్రత్యేక గీతాన్ని కూడా ఆల్రెడీ షూట్ చేసి ఉంచారు కాబట్టి ఇప్పట్లో ఇంకే పని ఉండదు. ఇక శంకర్ తో చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ మాత్రం చాలా ఆసక్తిగా ఉంటున్నాయి. తాజాగా ట్రైన్ ఎపిసోడ్ కు సంబంధించిన న్యూస్ ఒకటి ఫిలిం నగర్ సర్కిల్స్ లో గట్టిగానే చక్కర్లు కొడుతోంది

వందలాది ఫైటర్లు జూనియర్ ఆర్టిస్టులతో శంకర్ ఇందులో భారీ యాక్షన్ బ్లాక్ ఒకటి ప్లాన్ చేశారట. అంటే రజనీకాంత్ రోబోలో పెట్టినట్టు కాకుండా దానికన్నా పదింతలు హై వోల్టేజ్ ఫైట్ అండ్ ఛేజ్ తో ఉండబోతోందని తెలిసింది. ఈ ఒక్క భాగానికే సుమారు పది కోట్లకు పైగానే ఖర్చవ్వచ్చని అంటున్నారు. ఈ రేంజ్ లో చరణ్ గతంలో ట్రైన్ సీన్ చేయలేదు. రచ్చ లాంటి వాటిలో జస్ట్ ఇంట్రోలో అలా కనిపిస్తాడు కానీ ఫుల్ లెన్త్ చూడలేదు. అందుకే అభిమానులకు ఇది ఎగ్జైటింగ్ గా ఉంటుంది. పొలిటికల్ టచ్ ఉన్న ఈ సబ్జెక్టులో రామ్ చరణ్ కీలకమైన ప్రభుత్వ అధికారిగా కనిపిస్తాడని అంటున్నారు. షూటింగ్ లుక్ పోస్టర్లోనూ అదే అనిపించింది.

ఇలా ట్రైన్ ఎపిసోడ్ తో చిరంజీవికి మంచి సూపర్ హిట్లు ఉన్నాయి. గూండాలో రిస్క్ చేసి మరీ పట్టాల కింద తీసిన షాట్ ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేరు. కొండవీటి దొంగలో చిరు అమ్రిష్ పూరి మధ్య చొక్కాలు లేకుండా తీసిన ఫైట్ ఆ సినిమాకే హై లైట్ గా నిలిచింది. ఇద్దరు మిత్రులు క్లైమాక్స్ లో రాఘవేంద్ర రావు మరీ నవ్వుకునేలా తీశారు కానీ లేదంటే అది కూడా గుర్తుండిపోయేలా ఉండేది. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. శంకర్ సైతం ట్రైన్ ని వాడిన సందర్భాలు చాలానే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూరుస్తున్నారు. ఇంకా చాలా అప్డేట్స్ రాబోతున్నాయి

Also Read : త్రివిక్రమ్ గట్టిగానే బ్యాలన్స్ చేశారే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి