మహేష్‌ బాబు కుమారుడి మంచి మనసు!

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్న పిల్లలకు ఆపరేషన్లు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఎంబీ ఫౌండేషన్‌ ద్వారా వారికి ఆయన సాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది చిన్నారులకు ఆయన ఆపరేషన్లు చేయించారు. వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. తండ్రి బాటలోనే ఆయన కుమారుడు, కూతురు కూడా నడుస్తున్నారు. కూతురు సితార తన మొదటి యాడ్‌ రెమ్యూనరేషన్‌ను తండ్రి ఫౌండేషన్‌కు ఇచ్చేసినట్లు తెలిపింది.

ఇక, కుమారుడు గౌతమ్‌ కూడా ఎంబీ ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. తాజాగా, ఇందుకు సంబంధించిన ఫొటోలను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఆస్పత్రిలో ఓ బాలుడ్ని గౌతమ్‌ కలిసిన ఫొటోలవి. బాలుడు ఆస్పత్రి బెడ్‌పై ఉండగా.. గౌతమ్‌ పక్కన కుర్చీలో కూర్చుని బాలుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ కానుకను కూడా బాలుడికి అందించాడు. తర్వాత పిల్లల ఆరోగ్యం గురించి అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నాడు. నమ్రత తన పోస్టులో ఈ విధంగా రాసుకొచ్చింది..

‘‘ గౌతమ్‌ తరచుగా రెయిన్‌బో చిన్న పిల్లల ఆస్ప్రతికి వెళ్లి.. అక్కడి చిన్నారులను కలుస్తూ ఉంటాడు. రెయిన్‌బో చిన్న పిల్లల ఆస్పత్రితో కలిసి ఎంబీ ఫౌండేషన్‌ చిన్న పిల్లలకు పునర్జన్మ ఇస్తోంది. గౌతమ్‌ కూడా మా ఫౌండేషన్‌లో భాగంగా ఉన్నాడు. అప్పుడప్పుడు ఆంకాలజీ, కార్డియో వార్డులోని పిల్లలను కలుస్తూ ఉంటాడు. వారితో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్లు త్వరగా కోలుకోవడానికి, సంతోషంగా ఉండటానికి వారితో కొంత సమయాన్ని గడుపుతూ ఉంటాడు. చిన్న పిల్లలు త్వరగా కోలుకునేలా.. వారి పెదాలపై నవ్వులు తీసుకువస్తున్నందుకు గౌతమ్‌కు కృతజ్ఞతలు’’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. మరి, గౌతమ్‌ మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments